శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన ఒక పౌరుడ్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. మరో ఘటనలో బీహార్కు చెందిన ఒక కూలీపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ రెండు ఘటనలు సోమవారం జరిగాయి. బుద్గాం జిల్లాలోని గోత్పోరాలోని ఇంటి సమీపంలో ఉన్న తజాముల్ మోహియుద్దీన్ రాథర్ అనే వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు బుద్గాం ఎస్ఎస్పీ తహీర్ సలీం తెలిపారు.
మరో ఘటనలో దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో స్థానికేతర వ్యక్తిపై ఉగ్రవాదులు దాడి చేశారు. బీహార్కు చెందిన కూలీని గంగూ ప్రాంతంలో కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని ప్రత్యేక చికిత్స కోసం శ్రీనగర్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మరోవైపు ఈ రెండు ఘటనల నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలు ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్లో పర్యటించిన ఒక రోజు తర్వాత ఈ ఘటనలు జరుగడం ప్రాధాన్యత సంతరించుకున్నది.