కొలంబో: ఐపీఎల్లో మెరిసిన విధ్వంసకవీరులు క్రిస్ గేల్, డుప్లెసిస్ లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెల 5 నుంచి షురూ కానున్న ఈ టోర్నీలో ఐదు ఫ్రాంచైజీలు (కొలంబో స్టార్స్, దంబుల్లా జెయింట్స్, గాలే గ్లాడియేటర్స్, జాఫ్నా కింగ్స్, క్యాండీ వారియర్స్) పోటీ పడుతున్నాయి. శ్రీలంక ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ లీగ్లో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్తోపాటు ఆ దేశ స్టార్ ఆటగాళ్లు ఇమ్రాన్ తాహీర్, తబ్రేజ్ శంసీ, పాకిస్థాన్ ప్లేయర్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్ ఆడుతున్నారు. స్టార్ ఆటగాళ్లు లీగ్లో పాల్గొనడంపై ఐపీజీ గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ మోహన్ హర్షం వ్యక్తం చేశాడు. ‘స్టార్ ఆటగాళ్లు లేనిది ఏ టోర్నీ విజయవంతం కాదు. ఎల్పీఎల్లో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది’ అని అనిల్ మోహన్ పేర్కొన్నాడు.