హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): జనరల్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో చిత్తూరు జిల్లావాసి మృతి చెందారు. కురబల కోట మండలం ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ రక్షణశాఖలో లాన్స్నాయక్గా విధులు నిర్వహిస్తున్నారు. సీడీఎస్ వ్యక్తిగత భద్రతాసిబ్బందిలో సభ్యుడు. సాయితేజ మృతి పట్ల చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
2013లో బెంగళూరు రెజిమెంట్ నుంచి ఆర్మీ సిపాయిగా సాయితేజ్ ఎంపికయ్యారు. సిపాయిగా పనిచేస్త్తూనే పారాకమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. ప్రస్తుతం 11వ పారాలో లాన్స్నాయక్ హోదాలో పనిచేస్తున్నారు. సాయితేజకు భార్య శ్యామల, కుమార్తె దర్శిని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బుధవారం ఉదయం 8.45 గంటలకు సాయితేజ వీడియోకాల్ చేసి భార్య, కుమార్తె, కుమారుడితో మాట్లాడారు.
అనంతరం కొన్ని గంటల్లోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. సాయితేజ మృతితో మదనపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్టు బంధువులు తెలిపారు. మరణవార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులంతా స్వగ్రామానికి బయల్దేరి వెళ్లారు.