బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్
(భగవద్గీత 2-50)
మానవ జీవితం సంపూర్ణంగా ‘యోగ’వంతం కావాలన్నదే భగవదాశయం. యోగమే మనిషికి క్షేమకారకం. మనిషిలోని అన్ని దుష్టభావాలను దూరం చేయడానికి యోగమే అత్యంత సమర్థనీయమైనదిగా భారతీయ తత్వవేత్తలు భావించడానికి కారణం శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన గీతాబోధనే అన్నది అందరూ అంగీకరించిన సత్యం.
అయితే అసలు ‘యోగం’ అంటే ఏమిటి. యోగ సాధన చేయడానికి ఎటువంటి మానసిక స్థితి ఉండాలని భావించేవారికి భగవద్గీతలోనే సంపూర్ణ సమాధానాలున్నాయి. ‘సమత్వ బుద్ధి కలిగిన వ్యక్తి పుణ్యపాపాలు రెండింటినీ ఈ లోకంలోనే విడిచిపెడతాడు. అంటే వాటినుంచి విముక్తుడవుతాడు. అదే అసలైన యోగం. అందుకే అర్జునా! నువ్వు కూడా ఆ సమతా యోగాన్ని అనుసరించు. ఆ యోగాన్నే కర్మ కుశలత్వం అనవచ్చు. లేదా కర్మ కుశలత్వాన్నే యోగంగా భావించవచ్చు’ అని అర్జునుడికి వివరించాడు గీతాచార్యుడు.
ఈ మాటలను అనుసరించి బుద్ధి యుక్తుడైన వ్యక్తి ఎవరైనా పుణ్యపాపాలను వదిలేస్తాడు. అంటే పుణ్యకార్యాలను ఫలాపేక్ష రహితంగా ఆచరించి, పాపకార్యాల జోలికి వెళ్లకుండా సమత్వ బుద్ధితో వ్యవహరిస్తాడు. దానివల్ల అతను పుణ్య పాపాలను వదిలిపెట్టినట్లు అవుతుంది. పుణ్య కార్యాచరణకు ఫలితం అతనికి మనశ్శుద్ధి ప్రాప్తిస్తుంది. అవి బ్రహ్మానుభూతి పొందడానికి మార్గమవుతాయి. కర్మాచరణలో నిష్కామ భావనకు సరైన స్థాయి ఏర్పడుతుంది. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం సులువు అవుతుంది.
భగవంతుడు తన బోధనలో ‘సమత్వం యోగ ఉచ్యతే, యోగః కర్మసు కౌశలమ్’- వంటి మాటలు చెప్పడంలోని ఆంతర్యం కూడా నిష్కాముడై కర్తవ్యపాలన చేయడమే యోగంగా భావించినట్లు స్పష్టమవుతున్నది. ఇంతకుముందు శ్లోకాలలో కూడా శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని సంక్షిప్తంగా సారభూతంగా వివరించాడు. కర్మలను ఎన్నటికీ వదలిపెట్టరాదన్నాడు. యోగాన్ని గురించి ఇంతకు పూర్వశ్లోకాల్లోనూ ఈ యోగమనేది సమత్వబుద్ధే అన్న అంశాన్ని చెప్పాడు. కర్మఫలాలు తప్పవు కాని కర్మ చేసిన వ్యక్తి ఆ కర్మఫలాలను సమత్వబుద్ధితో స్వీకరించినప్పుడు, అతనిలో నిస్సంగత్వం బహిర్గతమవుతుంది! ఏ కర్తవ్యాన్నైనా కేవలం కర్తృత్వబుద్ధితో మాత్రమే చేసి ఫలాసక్తి రహితుడైనప్పుడు అతని మనస్సు ప్రశాంతతను పొందుతుంది, ఎటువంటి మానసిక వికారం అతని దరిదాపులకు కూడా రాదు.
సాధారణంగా చేసే పనులలో కర్తృత్వభావన ఎక్కువై దాని ఫలితం కర్తను అంటిపెట్టుకునే ఉంటుంది. దానివల్ల అతనిలో ఒక విధమైన మనోవైకల్యం ఏర్పడుతుంది. అది ఒక్కోసారి దుఃఖ కారణం అవుతుంది. అంటే ‘నేనే కర్తను’ అనే భావం మనసులో ఉంటే దానివల్ల చాలా దుష్పరిణామాలు పొడచూపుతాయన్నమాట. అవి తొలగాలన్నప్పుడు మనిషి ఎటువంటి ఫలాసక్తి భావం లేకుండా నిష్కామ భావనతో మాత్రమే కర్తవ్య నిర్వహణ చేయాలన్నది గీతాచార్యుని సందేశం. అంతేకానీ చేయవలసిన కర్మను, అంటే బాధ్యతను తప్పించుకునే యత్నం చేయరాదన్నదే భగవానుని అభిమతం. యుద్ధం విధిగా చేయవలసిన అర్జునుడు ఫలితం దుఃఖ దాయకం అవుతుందేమోనని కర్తవ్య నిర్వహణలో వెనుకంజ వేస్తున్న సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా బోధించాల్సి వచ్చింది.
మానవ ప్రపంచంలో ప్రతి వ్యక్తి విహిత కర్మలను ఆచరించవలసిందే అన్న సందేశం భగవద్గీత నిర్దంద్వంగా బోధిస్తూనే ఉంది. ‘పని’ అనేది ఒక పవిత్రమైన పూజ. పూజించడం మన ధర్మం. ఫలితం భగవదిచ్చ. ఒకవిధంగా ఫలితమంటే ప్రసాదమే. అది భగవంతుడు మనకు ఇచ్చేదన్నమాట. కానీ, ఫలితాన్ని ముందే ఆశించొద్దు. ఆ విధంగా ఉండాలంటే కర్మను ఆచరించే వ్యక్తి ధర్మబద్ధుడై, నిష్కామ భావనతో సమత్వబుద్ధితో ప్రవర్తిస్తే.. అదొక మహాయోగంగా భావించినట్లు అవుతుంది. అందుకే ఆ యోగాన్ని అందుకోవాలని నారాయణుడు నరుని ద్వారా మనందరికీ అందించిన సందేశమే సమత్వ బుద్ధి కలిగి ఉండటం. అది ఆచరణలో చూపించడమే మనిషి కర్తవ్యం.
గన్నమరాజు
గిరిజామనోహరబాబు