భగవంతుడి వల్ల మనకు ఆయువు, భోగం, జన్మలు సంప్రాప్తమయ్యాయి. గతంలో చేసిన కర్మలకు అనుగుణంగా తర్వాతి కాలంలో జన్మలు లభిస్తుంటా యి. మనం ఏదో ఒక శరీరాన్ని పొందడంలో ఒక రహస్యం దాగి ఉంది. దానికే అదృష్టం అనిపేరు. అయితే మనం అదృష్టం కొద్ది పొందగలిగింది స్థూలశరీరం మాత్రమే! ఈ స్థూలశరీరాన్ని మనకు తల్లిదండ్రులు ఇస్తారు. కానీ, దీనికి మూలం సూక్ష్మశరీరం. అది భగవంతుడి వల్లే సంప్రాప్తమవుతుంది. సూక్ష్మ శరీరమే కర్మ ఫలానుసారం, అంటే పూర్వజన్మ వాసనల వల్ల తదనుగుణమైన ఆకారాన్ని ధరిస్తుంది. దాన్నే మనం స్థూలశరీరం అంటున్నాం. స్థూలశరీరంలో కాళ్లు, చేతులు, ముఖం, నోరు మొదలైన అవయవాలు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ, అంతరింద్రియమైన మనస్సు, పంచప్రాణాలు కనిపించవు.
స్థూలశరీరం అందరికీ ఒకే విధంగా ఉంటుంది. కానీ, మనసు చేసే కార్యకలా పాల వల్ల అది ఒకదానికంటే మరొకటి భిన్నంగా అనిపిస్తుంది. ఇక సూక్ష్మశరీరం అనేది పదిహేడు తత్వాలతో కూడుకొని ఉంటుంది. అవి పంచ జ్ఞానేంద్రియా లు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, బుద్ధి, అహంకారం. సూక్ష్మశరీర మే సర్వ జీవకోటిని స్థూలశరీర ధారులను చేస్తుంది. మనం సుఖదుఃఖాలను స్థూలశరీరంతో అనుభవిస్తామా? లేక సూక్ష్మశరీరంతో అనుభవిస్తామా? అనేది ప్రశ్న. సుఖదుఃఖాలను అనుభవిస్తున్నది స్థూలశరీరమే అన్న భ్రమ కలుగుతుం ది. కానీ, సూక్ష్మశరీరమే స్థూలశరీరం ద్వారా అనుభవిస్తున్నదని బుద్ధిమంతులు గ్రహిస్తారు. మరికొందరు జీవునికే సుఖదుఃఖాలు కలుగుతున్నాయని అనుకుం టారు. కానీ, సుఖదుఃఖాలను అనుభవించేది జీవుడూ కాదు, స్థూలశరీరమూ కాదు. కేవలం సూక్ష్మశరీరమే! మరి జీవుడు ఎందుకు తానే అనుభవిస్తున్నట్లు భావిస్తున్నాడంటే.. అతడు తానే బుద్ధి రూపాన్ని పొందడం వల్ల. బుద్ధి సూక్ష్మశరీరంలో భాగం.
ఉదాహరణకు స్ఫటికం ముందు పూలగుత్తిని పెట్టినప్పుడు పూల రంగులు స్ఫటికంలో ప్రతిబింబిస్తాయి. నిజానికి ఆ రంగులు పూలగుత్తివే గాని స్ఫటికా నివి కావు. ఏ విధంగా పూలగుత్తి రంగులు స్ఫటికానివి కావో, అదేవిధంగా సుఖదుఃఖాలు కూడా జీవునివి కావు. కానీ, జీవుడు అజ్ఞానంతో తానే సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు భావించి బంధనంలో పడిపోతున్నాడు. ఈ సుఖదుఃఖాలనే గీతాచార్యుడు ‘ద్వంద్వం’ అనే పేరుతో పిలిచాడు. ఒక సుఖదుఃఖాలే కాదు, శీతోష్ణాలు, లాభనష్టాలు, మానావమానాలు మొదలైన వన్నీ ద్వంద్వాలే! మనిషి ద్వంద్వాలలో చిక్కుకోవడం వల్ల సంసార బంధనా ల్లోంచి బయటికి రాలేకపోతున్నాడు. తాను కూటస్థుడననే జ్ఞానం లేకపోవడం వల్లే మనిషి తనకు తాను అపకారం చేసుకుంటున్నాడు.
భగవంతుడిని ద్వంద్వాతీతుడని అంటారు. నిజానికి అతనిలో సుఖం లేదు, దుఃఖం లేదు. ఆ రెండింటినీ అనుభవించడు. కనుకనే అతడు ద్వంద్వాతీతుడు. అయితే ‘అతనిలో ఉన్నదేమిటి?’ అన్న ప్రశ్నకు సమాధానం ఆనందమని చెప్పుకోవాలి. మానవుడు కూడా భగవంతుడిలా ఆనంద స్వరూపుడు ఎందుకు కాడు? దీనికి సమాధానం సాంఖ్య దర్శనంలో దొరుకుతుంది. భగవంతునిలో అవివేకం లేదు. అవివేకమే బంధనానికి కారణం. ఎప్పుడైతే మనం శరీరంలో బందీ అయ్యామో అప్పుడే శరీర సంబంధమైన సుఖదుఃఖాలు మన వెంట పడతాయి. వాటికి దూరంగా ఉండాలంటే వివేకాన్ని అలవర్చుకోవాలి. వివేకం అంటే చాలామంది మంచి బుద్ధి అని అర్థం చెబుతారు. కానీ, ప్రకృతి వేరు, పురుషుడు (జీవుడు) వేరు అన్న జ్ఞానమే వివేకం. దీన్ని వివిక్త జ్ఞానం అంటారు. ఈ వివిక్త జ్ఞానాన్ని అలవర్చుకున్నప్పుడే మానవుడు సుఖదుఃఖాలకు అంటకుండా ఉంటాడు. ద్వంద్వాతీతుడై పరమేశ్వరుడికి ప్రియమైనవాడు అవుతాడు.
వివేకం వల్ల తాను బుద్ధిని కాదనే అవగాహనకు మానవుడు వస్తాడు. ఎప్పుడైతే తాను బుద్ధికంటే వేరైన వాడినని అనుకుంటాడో అప్పుడు మానం గాని, అవ మానం గాని తనవి కావనే నిశ్చయానికి వస్తాడు. ఇక మానం వల్ల ఉప్పొంగి పోవడం గాని, అవమానం వల్ల కుంగిపోవడం గాని జరగనే జరగదు. అందుకే నేను ‘బుద్ధి’ని అనే భావన వీడి నేను కూడా ‘నిత్య బుద్ధ ముక్త స్వభావుణ్ని’ అనే జ్ఞానాన్ని అలవర్చుకోవాలి. అందుకు గాను గీతలో చెప్పినట్లు వైరాగ్య భావనను పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే మనలో ప్రాపంచిక విషయాల పట్ల తృష్ణ ఉండదో, అప్పుడే సుఖదుఃఖాది ద్వంద్వాలలో చిక్కుకోకుండా ఉండగలం.
ఆచార్య మసన చెన్నప్ప
98856 54381