ఆంజనేయుడు పసివాడుగా ఉన్నప్పుడే ఉదయ సూర్యుణ్ని పండుగా భావించాడు. అంతే ఆదిత్యుణ్ని ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. ఈ సందర్భాన్నే ‘యుగ సహస్ర యోజన పరభానూ/లీల్యోతాహి మధురఫల జానూ’ అని హనుమాన్ చాలీసా 18వ చౌపాయీలో తులసీదాసు పేర్కొన్నాడు. ఇక్కడ ‘యుగ సహస్ర యోజన’ అంటే లెక్కించలేనంత దూరం అని అర్థం. యోజనం అంటే సుమారు 13 కిలోమీటర్లు. కొంతమంది మాత్రం యుగ అంటే 12,000గా తీసుకొని, సహస్రం (1,000), యోజనం (13 కిలోమీటర్లు) తో గుణించి 15 కోట్ల కిలోమీటర్లని లెక్కించారు. ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం భూమికి, సూర్యుడికి మధ్య దూరం రమారమీ ఇంతే అని తేలింది. అయితే ఇందులో ‘యుగం’ కాలానికి సంబంధించిన ప్రమాణం. ‘యోజనం’ దూరానికి సంబంధించింది. గణితశాస్త్ర నియమాల ప్రకారం కాలాన్ని, దూరంతో గుణించకూడదు. కాబట్టి కేవలం ఆంజనేయుడి అపరిమిత బలాన్ని వర్ణించడానికి మాత్రమే తులసీదాసు ఈ పదాలు ప్రయోగించాడని తెలుస్తున్నది.
బాల ఆంజనేయుడు సూర్యుణ్ని మింగబోతుంటే దేవతలంతా భయభ్రాంతు లకు లోనయ్యారు. మారుతిని నిలువరించడానికి దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. దాంతో అంజనీ తనయుడు నేలపై పడిపోయాడు. దవడకు గాయమై అది వంకరపోయింది. అలా ఆంజనేయుడు హనుమంతుడు అయ్యా డు. ‘హనువు’ అంటే దవడ. తన పుత్రుడు గాయపడటంతో వాయుదేవుడు ఆగ్రహించాడు. విశ్వంలో సంచరిస్తున్న గాలినంతా విరమించుకున్నాడు. ఊపిరాడక సృష్టి అల్లాడింది. దేవతల ప్రార్థన మేరకు వాయువు మళ్లీ వీయడం మొదలుపెట్టాడు. దీనికి ప్రతిగా ఇంద్రాది దేవతలంతా తమ సమస్త శక్తులనూ ఆంజనేయుడికి ధారపోశారు. సూర్యుణ్ని అందుకునే క్రమంలో మారుతి నక్షత్రాలు, గ్రహాలతో బంతులాడుకున్నాడట.
కాగా, సూర్యుడంటే హనుమకు కేవలం ఆటవస్తువు మాత్రమే కాదు. గురువు కూడా. తనకు తగిన గురువును చూపించమని అడిగినప్పుడు, ప్రపంచానికి వెలుగునిచ్చే కర్మసాక్షి దివాకరుడే గొప్ప గురువని సలహా ఇచ్చారట. దాంతో సూర్యుణ్ని తనకు గురువుగా ఉండమని కోరాడు ఆంజనేయుడు. ఒక్కచోట స్థిరంగా ఉండకుండా, నిరంతరం పయనిస్తుంటాడు కనుక విద్యా బోధన తనకు కుదరదన్నాడు సూర్యుడు. ఆంజనేయుడు వెనక్కి తగ్గలేదు. అలా సూర్యుడి నుంచి నాలుగు వేదాలు, తొమ్మిది రకాల వ్యాకరణాలతోపాటు సమస్త విద్యలూ నేర్చుకున్నాడు. గురుదక్షిణ ఏమివ్వాలని అడిగాడు. ఏమీ వద్దన్నాడు సూర్యుడు. అయినా ఎంతకూ హనుమంతుడు వినకపోవడంతో, తన కొడుకు సుగ్రీవుడికి అన్నివేళలా రక్షగా ఉండమన్నాడు. అలా రాముడు పరిచయమై, సుగ్రీవుడికి వానర రాజ్య పట్టం కట్టేవరకు వాయుపుత్రుడు సూర్యపుత్రుణ్ని కంటికి రెప్పలా చూసుకున్నాడన్నది కథ. ఈ రెండు సందర్భాల్లో మాత్రమే కాకుండా లక్ష్మణుడికి ప్రాణాపాయం ఏర్పడినప్పుడు సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చే క్రమంలో ఉదయించకుండా సూర్యుణ్ని తన అధీనంలో ఉంచుకున్నాడు హనుమంతుడు. ఈ చర్యలన్నీ ఆయనను స్థల, కాలాలకు అతీతుడిగా నిలబెడతాయి.
రామాయణాన్ని అనుసరించి రావణుడు కూడా మంచి జ్యోతిష శాస్త్రవేత్త. అయితే రావణుడిది గ్రహాలన్నీ తనకు అనుకూలంగా ఉండాలన్న తత్వం. హనుమంతుడు మాత్రం తన శక్తిని ఇతరుల మేలుకోసం ఉపయోగించే లక్షణం కలిగినవాడు. అందువల్ల దుష్టగ్రహ బాధల నుంచి విముక్తి పొందడానికి ఆంజనేయుణ్ని ఆశ్రయిస్తారు. ప్రత్యేకించి మంగళ, శనివారాల్లో హనుమను శక్తికొద్దీ ఆరాధిస్తారు.
చింతలపల్లి
హర్షవర్ధన్