కరీంనగర్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ‘చరిత్రలో రాజులు, చక్రవర్తుల పాలన చూసినా ప్రజారంజకంగా ఉండేది. రాచరిక పాలనలో సైతం ప్రజల అభీష్టానికి గౌరవం ఉండేది. కానీ.. తెలంగాణ ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా పాలన సాగిస్తున్నది. రాజకీయ వైరానికి పోయి ప్రజలపై పగ పెంచుకుంటున్నట్టుగా ఉన్నది’ అంటున్నారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చింతలపల్లి స్వామిరెడ్డి. స్వామిరెడ్డి రైతు కూడా. గడిచిన పదేండ్లలో రైతులు ఎంత సుభిక్షింగా ఉన్నారో.. ఈ నాలుగు నెలల్లో ఎంతటి దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారో.. వివరిస్తూ సోషల్ మీడియాలో ఆయన చేసిన ఆడియో రికార్డు వైరల్గా మారింది. ఆయన మాటల్లోనే.. ‘తెలంగాణ పీఠభూమి ప్రాంతం. ఎత్తు పల్లం ఉన్నది కాబట్టి మనం నదులపై ప్రాజెక్టులు కట్టుకోవడం, ఎత్తిపోతలు నిర్మించుకోవడమే ముఖ్యం. ఆంధ్రాలాగా మనది సమతల భూ ప్రాంతం కాదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కాళేశ్వరం ఎత్తిపోతల విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనదని నేను ఘంటాపథంగా చెప్పదల్చుకున్న. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే ఎల్లంపల్లికి మాత్రమే ఉపయోగపడుతుందని అప్పటి సీడబ్ల్యూసీ నివేదిక మేరకే కేసీఆర్ మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు.
మూడేండ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేశారు. మనకు ఉన్న 32 పండ్లలో ఒక పన్నుకు నొప్పి కలిగితే దానిని బాగు చేసుకునే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే దానిని తీసేసి కొత్త పన్ను పెట్టుకుంటం. ఇది కూడా అంతే.. పిల్లర్లు పోయినయి.. ఇది పోయింది.. అది పోయిందని చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటాపోతే ప్రజల నడ్డి విరుచుడు తప్ప ఏమీ లేదని నేను చెప్పదల్చుకున్న. బీఆర్ఎస్ తల్చుకుంటే చందాలు వసూలు చేసి కాళేశ్వరం నిర్మించగలదు. పార్టీ సభ్యత్వం 60 లక్షలు ఉంది. తలా రూ.వెయ్యి వేసుకున్నా రూ.6 కోట్ల చిల్లర అవుతుంది. మేడిగడ్డ వద్ద కాఫర్డ్యాంను నిర్మించుకునేందుకైనా ముందుకు రావాలని నేను కోరుతున్న. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్న. నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆంధ్రా నాయకులు వాళ్లు అనుకున్న స్థలంలోనే నిర్మించుకోగలిగారు. ఇది మనకు ఏమైనా ఉపయోగం ఉన్నదా? వాళ్లకే ఎక్కువగా ఉపయోగం ఉన్నది.
ఏపీ మనకు ఎక్కువ అన్యాయం చేసింది. కేంద్రం పేరు చెప్పి నీటి వాటాను ఎగ్గొట్టింది. కేంద్రం కూడా తాత్సారం చేయడం, తెలంగాణకు అన్యాయం జరిగింది. రాజులు, చక్రవర్తులు కూడా ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని పాలించారు. ఇప్పుడు ప్రజల అవసరాలను గుర్తించకుండా రాజకీయ కక్షలకు పోతూ జనం నడ్డి విరుస్తున్నారు. ఏ ప్రభుత్వం బాగుంది? ఏ ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగించిందనేది ప్రజలు కూడా ఆలోచించాలి. కేసీఆర్ను దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగించడం మంచిదని తెలంగాణ ప్రభుత్వానికి సవినయంగా విన్నవించుకుంటున్న. గత పాలకులు ఎవరైనా తప్పు చేస్తే చట్ట పరంగా వారిపై విచారణ జరపండి. దోషులని తేలితే శిక్షించండి. కానీ వారిపై కోపంతో ప్రజలను ఎందుకు నష్టపరుస్తున్నారని నేను అడుగుతున్న. ఓటు వేసిన ప్రజలను ఎందుకు విస్మరిస్తున్నారు. ఫర్ ద పీపుల్.. ఆఫ్ ద పీపుల్.. బై ద పీపుల్ అని చెప్పిన అబ్రహం లింకన్ మాటలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు కోరుకున్న పాలన సాగించాలి. ఈ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలి. లేదంటే ప్రజలు, రైతులే ముందుకు వచ్చి చందాలు వేసుకుని కాఫర్ డ్యాంను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాజెక్టులను నింపుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైనా ప్రజల మంచిని కోరుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్న’ అని విశ్రాంత ఉపాధ్యాయుడు పేర్కొన్నారు.