ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 11: సమాజ హితానికి యజ్ఞం చేయాలని, తద్వారా సత్ఫలితాలు వస్తాయని చిన జీయర్ స్వామి తెలిపారు. మండల పరిధిలోని ఎదులాబాద్ గ్రామంలోని గోదాసమేత మన్నారు రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం స్వామి వారిని ఆయన దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ గర్భగుడిలో ధర్మకర్తలు స్వామిజీకి స్వాగతం పలికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతూ ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో రెండు లక్షల కిలోల నెయ్యి, 1035 యజ్ఞ కుండలికలతో యాగం చేయనున్నట్లు చెప్పారు. యాగాలు చేయడం ద్వారా వాతావరణంలో మార్పులు సంభవించి వర్షాలు కురుస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ సురేశ్, సహకార సంఘం డైరెక్టర్ ధర్మారెడ్డి, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.