కుమ్రంభీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/కోటపల్లి, ఏప్రిల్ 2: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో శనివారం రాత్రి ఉల్కాపాతం కనువిందు చేసింది. రాత్రి 8-9 గంటల మధ్య పదుల సంఖ్యలో ఉల్కలు నిప్పులు కక్కుతూ నేలరాలాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంతోపాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి, సిరొంచ ప్రాంతాల్లో 10 నిమిషాలపాటు ఆకాశం నుంచి ఉల్కలు జారుతున్న దృశ్యాలను స్థానికులు తమ సెల్ఫోన్లలో బంధించారు. అయితే, అది ఉల్కాపాతం కాదని, చైనాకు చెందిన చాంగ్ జెంగ్5బీ రాకెట్ శకలాలు కావొచ్చని అమెరికా శాస్త్రవేత్త జొనాథన్ అనుమానించారు. చైనా గతేడాది ఫిబ్రవరిలో ప్రయోగించిన రాకెట్ శనివారం భూఉపరితంలోకి వస్తుందని అంతకుముందు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆ రాకెట్ భూవాతావరణంలోకి వచ్చి పేలిపోవడం వల్లే ఉల్కల్లా కనిపించి ఉంటాయని జొనాథన్ పేర్కొన్నారు.