బీజింగ్: తైవాన్ వద్ద మరోసారి చైనా భారీ స్థాయిలో సైనిక విన్యాసాలను ప్రారంభించింది. యాంటీ సబ్మెరైన్ దాడులతో పాటు సముద్ర రెయిడ్స్ను ప్రాక్టీస్ చేయనున్నట్లు చైనాకు చెందిన ఈస్ట్రన్ థియేటర్ కమాండ్ పేర్కొన్నది. ఇటీవల అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించిన నేపథ్యంలో చైనా తన సైనిక సత్తాను చాటింది. తొలుత నాలుగు రోజుల పాటు సైనిక విన్యాసాలను నిర్వహించింది. మళ్లీ ఇవాళ డ్రాగన్ దేశం రెండో దఫా డ్రిల్స్ను చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే దేశంలోకి చొరబడే ఉద్దేశంతోనే చైనా ఈ డ్రిల్స్ను ప్రాక్టీస్ చేస్తున్నట్లు తైవాన్ ఆరోపించింది. చైనాకు చెందిన ఎయిర్క్రాఫ్ట్, నౌకలు తమ జలాల్లోకి ప్రవేశించినట్లు తైవాన్ సోమవారం వెల్లడించింది. చైనా నిర్వహిస్తున్న సైనిక డ్రిల్స్ను అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఖండించాయి.