టోక్యో: అమెరికా కొత్త పాలకవర్గం కూడా చైనా తీరుపై తీవ్రంగా మండిపడింది. ఆసియా ప్రాంతంలో ఆ దేశం దూకుడుగా, అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్తో కలిసి ఆయన జపాన్, సౌత్ కొరియా పర్యటనల్లో ఉన్నారు. ఈ సందర్భంగా టోక్యోలో జపాన్ జర్నలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశంలో బ్లింకెన్ మాట్లాడారు. ఆసియా ప్రాంతంలో చైనా ఉద్రిక్తతలను పెంచుతోంది తప్ప తగ్గించడం లేదని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ చైనా సముద్రంలో, తైవాన్ విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా బ్లింకెన్ ప్రస్తావించారు. బైడెన్ పాలకవర్గం తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. దక్షిణ చైనా సముద్రంపై సంపూర్ణ హక్కులు తమకే ఉన్నాయని వాదిస్తూ ఆ సముద్రంలో సైనిక స్థావరాలను కూడా చైనా ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది జపాన్కు రక్షణ సంబంధిత సవాళ్లను విసురుతోంది.
ఇంట్లో అణచివేత.. బయట దూకుడు
చైనా ఇంట అణచివేత ధోరణి, బయటి దేశాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది. తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ల విషయంలో చైనా తీరు ఆందోళన కలిగిస్తోంది అని బ్లింకెన్ అన్నారు. తూర్పు చైనా సముద్రంలోని సెంకాకస్ దీవులు జపాన్ నియంత్రణలో ఉన్నా చైనా మాత్రం అవి తమవే అని వాదిస్తోంది. మీడియాతో మాట్లాడే ముందు బ్లింకెన్, ఆస్టిన్.. జపాన్ విదేశాంగ, రక్షణ మంత్రులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత చైనా మంత్రులతోనూ వీళ్లు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా చైనా చర్యలపై తమ ఆందోళనలను తెలియజేస్తామని బ్లింకెన్ చెప్పారు.