కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 24 : సెలవు దినమే ఆ పిల్లలకు చివరి రోజైంది. సెల్లార్ గుంత వారి ఉసురు తీసింది. అడ్డుగా ఉన్న కంచె దాటడమే నేరమైంది. అభం శుభం తెలియని ముగ్గురు బాలికలను మింగేసింది. శుక్రవారం విషాదం మిగిల్చిన ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్బీ కాలనీ నాలుగో ఫేజ్లో వేర్వేరు కుటుంబాలకు చెందిన సంగీత(12), రమ్య(7), సోఫియా(10)లతో పాటు నేహ(10), నవ్య(10) లు ఐదుగురు స్నేహితులు. వీరి కుటుంబాలు ఆర్టీఏ కార్యాలయం రోడ్డుపై గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. చిన్నారులంతా స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. శుక్రవారం పాఠశాలకు సెలవు కావడంతో మధ్యాహ్నం భోజనం చేసి స్నేహితులంతా కలిసి ఆడుకోవడానికి వెళ్లారు.
కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్లో హౌసింగ్బోర్డు సంస్థ భారీ నిర్మాణం కోసం తవ్విన సెల్లార్ గుంత వీరి గుడిసెలకు ఆనుకొనే ఉంటుంది. ఖాళీ సమయం దొరికితే ఈ చిన్నారులంతా సెల్లార్ గుంతకు రక్షణగా వేసి ఉన్న ఫెన్సింగ్ దాటి వచ్చి అక్కడి ఖాళీ స్థలంలోనే అడుకుంటూ ఉంటారు. దాదాపు ఆరెకరాల ఖాళీ స్థలంలో రెండెకరాల్లో మాత్రం సెల్లార్ కోసం తవ్విన గుంతలో నీళ్లు నిండి ఉన్నాయి. శుక్రవారం కూడా ఎప్పటిలాగానే ఖాళీ స్థలంలో ఆడుకుంటూనే సంగీత మరికొంత దూరం వెళ్లి నీటి గుంతలోకి దిగింది. ఆమె నీటిలో మునిగిపోతుండగా కాపాడే ప్రయత్నంలో
రమ్య కూడా నీటిలో పడిపోయింది. వీరిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నిస్తూ సోఫియా కూడా నీటి గుంతలో పడిపోయింది. ఈ ముగ్గురిని కాపాడేందుకు నేహ ప్రయత్నిస్తూ అందులో పడిపోయే క్రమంలో.. గడ్డిపొరక సహాయంతో బయటపడింది. వెంటనే నేహ, నవ్యలు సెల్లార్ ఫెన్సింగ్ నుంచి బయటికొచ్చి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి కేపీహెచ్బీ కాలనీ సీఐ కిషన్కుమార్, జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రవికుమార్, కేపీహెచ్బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావులు చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో ఆ ముగ్గురి మృతదేహాలను బయటికి తీశారు.
చిన్నారుల తల్లిదండ్రులందరూ పొట్టకూటి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చినవారే. ఆడుకుంటూ అనంతలోకాలకు వెళ్లిపోయి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది.
బీహార్కు చెందిన లక్ష్మణ్ప్రసాద్ బతుకుదెరువు కోసం వచ్చి కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయం రోడ్డులో నివసిస్తూ రోడ్డుపై చాయ్బండి నడుపుతున్నాడు. ఇతనికి ఐదుగురు సంతానంలో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. గత నవంబర్లోనే ఇతని భార్య మరణించింది. రెండో తరగతి చదువుతున్న నాలుగో అమ్మాయి సంగీత (12) శుక్రవారం మరణించడంతో ఆ తండ్రిని ఎవరూ ఓదార్చలేకపోతున్నారు. దేవుడికి దయలేదని తమ వాళ్లందరినీ తీసుకెళ్తున్నాడని లక్ష్మణ్ ప్రసాద్, అతని కూతుర్లు రోదించారు.
ఉత్తర్ప్రదేశ్కు చెందిన గీత, ప్రమోద్ బతుకుదెరువు కోసం వచ్చి ఆర్టీఏ రోడ్డులో చాయ్ బండి నడుపుతున్నారు. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం. కాగా వీరి కూతురు రమ్య (7) ఒకటవ తరగతి చదువుతున్నది.
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం పెద్దపెల్లి గ్రామానికి చెందిన పర్వీన్ బతుకుదెరువు కోసం నగరానికొచ్చింది. ఆర్టీఏ కార్యాలయం పక్కనే గుడిసెలో నివసిస్తూ పక్కన అపార్ట్మెంట్లలో పనిచేస్తూ బతుకున్నది. ఈమె కూతురు సోఫియా (10)నాలుగో తరగతి చదువుతున్నది.
కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్లో 6.5 ఎకరాల స్థలంలో భవన నిర్మాణాలు చేపట్టాలని ఆనాటి ఏపీ హౌసింగ్ బోర్డు సంస్థ 2014లో సర్వే నిర్వహించింది. 2015లో భవన నిర్మాణానికి అందులోని 2 ఎకరాల స్థలంలో సెల్లార్ గుంతను తవ్వారు. కానీ.. రేట్లు పెంచడం, 10 శాతం డబ్బులు చెల్లించాలని లబ్ధిదారులను కోరడంతో డబ్బులు చెల్లించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ ప్రాజెక్టు 2015లో ఆగిపోయింది. ఈ సెల్లార్ తవ్వకాలు ప్రారంభించినప్పుడు చుట్టూరా జీఐ షీట్తో కంచె ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే 2015లో నాలుగేండ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి గుంతలోపడి మృతి చెందాడు. 2017లో క్రికెట్బాల్ కోసం వెళ్లిన యువకుడు(19) మరణించాడు.
ఈ రెండు ఘటనలతో కేపీహెచ్బీ కాలనీవాసులు, ప్రజాప్రతినిధులు ఆందోళన చేశారు. దీంతో హౌసింగ్ బోర్డు సంస్థ ఆ యువకుడి కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చింది. ప్రమాదం జరుగకుండా సెల్లార్ గుంత చుట్టూ చైన్లింక్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేసింది. కానీ.. అభం శుభం తెలియని మరో ముగ్గురు చిన్నారులను నీటిగుంత మింగేసింది. స్థానికంగా హౌసింగ్ బోర్డుపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సెల్లార్ గుంత ఐదుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకున్నదని, దీనిని మూసేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు అధికారులను వేడుకున్నాడు.