కరీంనగర్ : జిల్లాలోని బాలలకు సత్వర సేవలు అందించేందుకు బాల రక్షక్ వాహనం అందుబాటు లోకి వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బాల రక్షక్ వాహనాన్ని కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పిల్లలను త్వరగా కాపాడడానికి ప్రభుత్వం బాల రక్షక్ వాహనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
నవంబర్ 14న రాష్ట్రం మొత్తం 33 వాహనాలను సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అన్ని జిల్లాలకు కేటాయించామన్నారు. ఆపదలో ఉన్న పిల్లలు ఎక్కడ కనపడినా హెల్ప్ లైన్ 1098 నెంబర్కు ఫోన్ చేస్తే ఈ సేవలకు సంబంధించిన అధికారులు వచ్చి పిల్లల సంరక్షణ చూసుకుంటారని అన్నారు. జిల్లాలోని బాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.
అలాగే గతంలో కంటే ఇప్పుడు బాలలకు అత్యంత దగ్గరగా సేవలు అందించేందుకు అనుకూలంగా బాలల కోసం ప్రభుత్వం బాల రక్షక్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న బాలల వద్దకు అధికారులు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలని మంత్రి సూచించారు.
కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప హరిశంకర్, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, సిడబ్ల్యూసి చైర్ పర్సన్ ధనలక్ష్మి, డిసిపిఓ శాంత, సిడబ్ల్యూసి సభ్యులు, సిడిపిఓ, ఐసిపిఎస్, చైల్డ్ లైన్, సఖి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.