మాతృభూమి రక్షణ కోసం ఆమరణాంతం తపించిన వీరుడతడు! భరతమాతకు చెక్కుచెదరని గూర్ఖాయై నిలిచిన యోధుడతడు! దేశ భద్రత ఉచ్ఛ్వాసమై.. శత్రు హననం నిశ్వాసమై జీవించిన మహారథుడు.. ఇక లేడు! తాత అందించిన స్ఫూర్తి.. తండ్రినుంచి పొందిన ప్రేరణతో భరతమాత పొత్తిళ్లలో ఎదిగిన అసమాన సైనికుడు గగనసీమలకేగాడు!
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్.. జనరల్ బిపిన్ రావత్ ఆకస్మికంగా లోకం నుంచి నిష్క్రమించారు.
వైరి శక్తులను దునుమాడటంలో అహరహం తపించే ధీరుడు.. తన సహచరులకు ప్రేరణనిచ్చేందుకు వస్తూ.. తమిళనాడులోని నీలగిరి కొండల్లో కూనూరు వద్ద ఒరిగిపోయారు. మరికొద్ది సేపట్లో నీలగిరి జిల్లా వెల్లింగ్టన్లో దిగాల్సిన హెలికాప్టర్.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. పేలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న రావత్ దంపతులు సహా
13 మంది నిలువునా కాలిపోయారు. వీరుడిని కోల్పోయిన ఈ దేశం అనంతమైన దుఃఖంలో మునిగిపోయింది.. బాధాతప్త హృదయంతో త్రివర్ణ పతాక అవనతమై శోకించింది.
న్యూఢిల్లీ/చెన్నై, డిసెంబర్ 8: భారత త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ (63) కన్నుమూశారు. తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించినట్టు భారత వాయుసేన ప్రకటించింది. కూనూర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించింది. దుర్ఘటనలో జనరల్ రావత్, ఆయన సతీమణి మధూలికతోపాటు మరో 11 మంది మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కూనూర్ స్థానిక అధికారులతో పాటు, డీఎన్ఏ పరీక్ష వివరాలను సమీక్షించి వాయుసేన ఉన్నతాధికారులు.. తుది నిర్ణయానికి వచ్చాకనే జనరల్ రావత్ మరణాన్ని ధ్రువీకరించారు. ప్రమాదంలో గాయపడిన గ్రూప్
వరుణ్సింగ్ను సమీపంలోని మిలిటరీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంపై ఆర్మీ కోర్టు నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్టు వాయుసేన మరో ప్రకటనలో వెల్లడించింది. ఉదకమండలం (ఊటీ) సమీపంలో నీలగిరి కొండల్లో వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (డీఎస్ఎస్సీ)లో లెక్చర్ ఇచ్చేందుకు జనరల్ రావత్, మధులికా రావత్, ఆర్మీ ఉన్నతాధికారులు కలిసి వాయుసేనకి చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్లో బయల్దేరారు. మరో పది నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయం తెలియగానే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది.
విషాద ఘటన వివరాలను రక్షణమంత్రి రాజ్నాథ్ ప్రధానికి వివరించారు. ఢిల్లీలోని జనరల్ రావత్ నివాసానికి వెళ్లిన రాజ్నాథ్ ఆయన కుమార్తెలతోనూ మాట్లాడారు. సాయంత్రం ప్రధాని అధ్యక్షతన రక్షణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. దుర్ఘటనపై కేంద్రం గురువారం పార్లమెంటులో ప్రకటన చేయనున్నది. గురువారం రావత్ పార్ధీవదేహాన్ని ఢిల్లీకి తరలించనున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మృత్యుంజయుడు వరుణ్సింగ్ ఎంఐ-17వీ5 హెలికాప్టర్ ప్రమాదంలో ‘శౌర్య చక్ర’ పురస్కార గ్రహీత కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రస్తుతం తీవ్ర గాయాలతో బయటపడ్డారు.