Vijay-Rashmika | సిల్వర్ స్క్రీన్పై అద్భుతమైన కెమిస్ట్రీతో అభిమానుల మనసులు గెలుచుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పుడు నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ ప్రముఖ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే కుటుంబసభ్యులతో కలిసి ఉదయ్పూర్కు చేరుకున్న ఈ జంట, అక్కడి లగ్జరీ వేదిక మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్’ Mementos by ITC Hotelsను డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఎంపిక చేసుకున్నారు. సన్నిహితుల నడుమ సాంప్రదాయ వేడుకగా ఈ వివాహాన్ని అత్యంత ప్రైవేట్గా నిర్వహించనున్నట్లు సమాచారం.
మంగళవారం నుంచి హల్దీ, సంగీత్ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కేవలం 50-100 మంది అత్యంత సన్నిహిత కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలోనే ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. అతిథుల కోసం ‘నో-ఫోన్’ పాలసీని కఠినంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో పెళ్లి వేడుకల ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 24) మెహందీ, రేపు (ఫిబ్రవరి 25) హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. . ఈ వివాహ వేడుకకి విరోష్ అని నామకరణం చేశారు. ఇక రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించినట్లుగా, అతిథుల కోసం ప్రత్యేకంగా జపనీస్ వంటకాలను మెనూలో చేర్చారు. సంప్రదాయం, ఆధునికత కలయికగా ఈ వివాహాన్ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో విజయ్–రష్మిక జంట ఆన్స్క్రీన్లో సూపర్ హిట్ పెయిర్గా నిలిచింది. ఆ సినిమాల సమయంలోనే వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీపై అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆ బంధం నిజ జీవితంలో వివాహంగా మారుతోంది. పెళ్లి అనంతరం మార్చి 4న హైదరాబాద్లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. టాలీవుడ్కు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి, అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ జంట పెళ్లి వేడుక ఇప్పుడు నిజం కావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. టాలీవుడ్లో మరో స్టార్ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.