హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫాంహౌస్లో అడుగుపెట్టు.. ఆరు ముక్కలైతవ్’ అని హెచ్చరించారు. నా ఫాంహౌస్ దున్నడానికి నువ్వేమన్నా ట్రాక్టర్ డ్రైవర్వా? అని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యవహార శైలిని ఉతికి ఆరేశారు. మంచి పథకం మొదలు పెడితే దానికి కేసీఆర్ ఇంటికెళ్లి డబ్బు ఇస్తాడా? అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ‘మరి నీ ఇంట్లకెళ్లి ఇస్తున్నావా?’ అని సూటిగా ప్రశ్నించారు. బండి సంజయ్ తన ఫాంహౌస్కు వచ్చి దున్నుతానని అన్నాడని, అందుకే మెడలు ఇరగ్గొడుతానని హెచ్చరించానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘నేను ఊరుకున్నన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవ్. దిక్కుమాలిన పాదయాత్రల 50 సార్లు మాట్లాడినవ్. ఫాంహౌస్ నీ అయ్యదా. అక్కడికి వచ్చి పంటవా? ఏం దున్నతవ్. నువ్వేమన్నా ట్రాక్టర్ డ్రైవర్వా?’ అని ప్రశ్నించారు. భూ చట్టాల ప్రకారమే తనకు ఫాంహౌస్ ఉన్నదని, తాను రైతు కుటుంబంలో పుట్టానని, తనది వ్యవసాయక్షేత్రమని, గెస్ట్హౌస్ కాదన్నారు.
నువ్వు వచ్చి మందు కలిపినవా..?
‘నేను మందు తాగుతా అంటున్నవ్. నువ్వు వచ్చి నాకు మందు కలిపినవా? ఇదేనా నీ సంస్కారం? నీ గురువులు ఈ సంస్కారం నేర్పిన్రా?’ అని కేసీఆర్ మండిపడ్డారు. బండి సంజయ్ వేస్తున్న ప్రశ్నలు చూస్తుంటే పరిపాలనా అంశాలపై ఆయనకు కనీస పరిజ్ఞానం లేదన్న సంగతి తెలిసిపోతున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కొత్తగా రాష్ర్టాలు ఏర్పడినప్పుడు తుది కేటాయింపు జరిగే వరకు విద్యుత్తు, నీళ్లు వంటి అత్యవసర సర్వీసులు నిలిచిపోకుండా ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి, తాత్కాలిక కేటాయింపులు నిర్ణయిస్తారని వివరించారు. తెలంగాణ ఏర్పడేనాటికి కేటాయించిన ప్రకారం 299 టీఎంసీలు నీళ్లు వాడుకోవాలని, మిగిలినది ఆంధ్రాకు ఇవ్వాలని అప్పట్లో ఒక అంచనా ప్రకారం కేటాయించారని చెప్పారు. దీనిపై కనీస పరిజ్ఞానంలేని బండి సంజయ్ ‘ఆ ఫైల్పై ఎందుకు సంతకం పెట్టారు? అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎందుకు వెళ్లార’ని ప్రశ్నలు వేస్తున్నాడని పేర్కొన్నారు. ‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు రాష్ర్టాలకు విద్యుత్తు, నీళ్లు వంటి అత్యవసర సర్వీస్లు తాత్కాలికంగా నడవాల్సి ఉంటుందన్న విషయం తెలుసా? రాష్ట్రంలో పాలన జరగొద్దా? నీళ్లు, కరెంటు రావొద్దా? అందుకే సంతకం పెట్టిన’అని సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు.
రాష్ట్ర బీజేపీ నాయకులకు సిగ్గూ, ఎగ్గూ లేదు
ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టును ప్రధాని మోదీ గుంజుకుని ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేసినా, రాష్ట్ర బీజేపీ నాయకులు నోరు తెరవలేదు. రాష్ట్ర హక్కులను గుంజుకున్నడు కాబట్టే మోదీని ఫాసిస్ట్ ప్రధాని అని ఢిల్లీలో విమర్శించాను. ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదు. బీఆర్జీఎఫ్ రూ.400 కోట్లు ఎగబెట్టారు. నవోదయ పాఠశాలలు, ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నా తెలంగాణ బీజేపీ నేతలకు సిగ్గూ ఎగ్గూ లేదు. బీజేపీ నేతల మాటలు నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టినట్టే. ఈ కిరికిరిగాళ్లు అడ్డగోలుగా మాట్లాడ్తరు తప్ప వీళ్లకు బాధ్యత లేదు. వీళ్లను ఢిల్లీలో దేకేవాళ్లే లేరు. రాష్ట్ర బీజేపీ నేతలు నేరుగా కేంద్రమంత్రికే ఫోన్ చేసి, వడ్ల కొనుగోలుపై స్పష్టత తీసుకోవచ్చు. కానీ, కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడ?
తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు రాజీనామా చేశామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. నాడు బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో యెండెల లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తే కిషన్రెడ్డి దద్దమ్మలా రాజీనామా చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణపై ఓటింగ్ జరిగేటప్పటికీ బండి సంజయ్ పార్లమెంట్ను కూడా చూడలేదని ఎద్దేవా చేశారు. ‘ఇన్ని రోజులు ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మొరుగుతుంటాయిలే అని మిమ్మల్ని పట్టించుకోలేదు. పెద్దరికంతో వ్యవహరించినం. ఇంకా అట్లనే ఉంటామంటే వందశాతం తగిన బుద్ధి చెబుతాం. వదిలిపెట్టే ప్రశ్నే లేదు’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో పునాదిలేని, అడ్రస్ లేని బీజేపీ ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే ఇక కుదరదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి.. ఇల్లు, కారు ఇస్తామని అడ్డగోలుగా, తప్పుడు మాటలు చెప్పి నాలుగు సీట్లు సంపాదించిన బీజేపీ, టీఆర్ఎస్ కన్నా తక్కువే గెలిచిందని పేర్కొన్నారు. ఓడిపోతే ఓటమిని గంభీరంగా అంగీకరిస్తామని, బీజేపీ మాదిరిగా గాలి మాటలు చెప్పమని స్పష్టంచేశారు.