హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): దేశ సేవలో చేతక్ హెలికాప్టర్లది కీలక పాత్ర అని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. భారత వాయుసేనలో 60 ఏండ్లుగా సేవలందిస్తున్న ఈ హెలికాప్టర్ల సేవలను కీర్తిస్తూ శనివారం హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ కన్వెన్షన్ సెంటర్ డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలకు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో కలిసి రాజ్నాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ ‘చేతక్’ హెలికాప్టర్లు యుద్ధంలో సైనికుల్లా పోరాడాయన్నారు.రక్షణరంగ చరిత్రలో ఒక హెలికాప్టర్కు డైమండ్ జూబ్లీ చేయటం ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. 60 ఏండ్లలో 700 చేతక్ హెలికాప్టర్లు యుద్ధాల్లో పాల్గొన్నాయని వివరించారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఎంతో మంది ప్రాణాలను కాపాడాయని గుర్తు చేశారు. అనంతరం చేతక్ విజయాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎయిర్క్రాఫ్ట్ల ప్రదర్శన ఆకట్టుకొన్నది.