ముషీరాబాద్, జూలై 1: అడిక్మెట్ డివిజన్ రాంనగర్ ప్రధాన రోడ్డులో చాలాకాలంగా ఎదురవుతున్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మార్గం సుగగమైంది. రాంనగర్ ఈ సేవా, రాంనగర్ చౌరస్తా-చేపల మార్కెట్ రోడ్డులో మురుగు నీటి లీకేజీ సమస్య పరిష్కారం కోసం జలమండలి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రధాన రోడ్డులో వాహనదారులు, పాదచారులు మురుగునీటి సమస్యతో తీవ్ర ఇక్కట్లు పడుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టిసారించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జలమండలి అధికారులు త్వరలోనే టెండరు ప్రక్రియను పూర్తి చేసి పక్షం రోజుల్లో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాంనగర్ ఈ సేవా నుంచి రిథమ్ బార్ వరకు 65 మీటర్ల మేర, రాంనగర్ చౌరస్తా నుంచి చేపల మార్కెట్ వైపు 65 మీటర్ల మేర కొత్తగా పైపులైన్ల ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన భారీ డ్రైనేజీ పైపులైన్లు శిథిలమై పూడుకుపోవడంతో మురుగు నీటి సమస్య ఉత్పన్నమవుతున్నది. ఈ సమస్య పరిష్కారం కోసం కొత్త పైపులైన్ ఏర్పాటు అవసరమని భావించిన అధికారులు ఇటీవల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. వారంలో టెండరు ప్రకియను పూర్తి చేసి పనులు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాన రోడ్డులో మురుగు నీటి ఇక్కట్లు…
రాంనగర్ ఈ సేవా, చౌరస్తా సమీపంలో ఇటీవల మురుగు నీటి లీకేజీ సమస్య తలెత్తుతున్నది. మూడు దశాబ్దాల క్రితం ప్రధాన రోడ్డులో డ్రైనేజీ పైపులైన్లు ఏర్పాటు చేశారు. ముషీరాబాద్, చేపల మార్కెట్, రాంనగర్ల నుంచి వచ్చే మురుగు నీరు ఈ సేవా మీదుగా ప్రధాన రోడ్డు వెంట వెళ్లి ప్రధాన నాలాలో కలుస్తుంది. అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన పైపులైన్ సామర్థ్యం ప్రస్తుతం పెరిగిన జనాభా, నివాసాల సంఖ్యకు సరిపోకపోవడంతో మురుగు నీటి లీకేజీ సమస్య తలెత్తుతుంది. ఈ సేవా వద్ద బస్సు స్టాప్ ఎదురుగా రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్హోల్ వద్ద వారానికి రెండు మూడు సార్లు మురుగు నీరు లీకై రోడ్డంతా పారుతుంది. దీంతో బస్స్టాప్లో ఉన్న ప్రయాణికులు, పాదచారులు మురుగు నీటితో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పలువురు వాహనదారులు మురుగు నీటిలో జారిపడిపోయిన సంఘటనలు ఉన్నాయి.