నర్సంపేట/వరంగల్, మార్చి 24 (నమస్తేతెలంగాణ): కల్యాణలక్ష్మి పథకానికి ప్రేరణగా నిలిచిన ఆడబిడ్డ కల్పన కుమార్తె లూనావత్ చంద్రకళ పెండ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో గురువారం అర్ధరాత్రి 12 గంటలకు వేదమంత్రాల సాక్షిగా పెద్దల సమక్షంలో చంద్రకళ- బానోత్ చందర్ ఒకటయ్యారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, పెద్ది స్వప్న పెండ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వివాహం జరిపించారు. ఈ వేడుకకు చంద్రకళ-చందర్ల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులతో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు తరలివచ్చి నవదంపతులను ఆశీర్వదించారు. పెండ్లి కాగానే రూ.1,00,116 కల్యాణలక్ష్మి చెక్కును చంద్రకళ అందుకొన్నారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ జరిపించిన కల్పన పెండ్లి.. కల్యాణలక్ష్మికి ప్రేరణగా నిలిచింది. కల్పన పెండ్లి జరిగే సమయంలో వాళ్ల ఇల్లు కాలి పెండ్లికి తెచ్చిన డబ్బు, బంగారం, బట్టలు ఆహుతయ్యాయి. పెండ్లి ఆగిపోతుందనుకొన్న టైంలో అటుగా వచ్చిన కేసీఆర్.. కల్పన పెండ్లికి సాయం చేశారు. స్వరాష్ట్రంలో సీఎం అయ్యాక 2014 అక్టోబర్2న కల్యాణలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పది లక్షల మంది ఆడబిడ్డలు లబ్ధి పొందారు.