హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ రెడ్కో) రాష్ట్రంలో మొట్టమొదటి పర్యావరణ అనుకూల భవనాన్ని నిర్మించనున్నట్టు ఆ సంస్థ చైర్మన్ సతీశ్రెడ్డి తెలిపారు. దీని విస్తీర్ణం 2,591 చదరపు మీటర్లు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం శరవేగంగా పెరుగుతున్నదని, 2014లో కేవలం 70 మెగావాట్లుగా ఉన్న ఈ విద్యుత్తు, ఇప్పుడు 5,400 మెగావాట్లకు చేరుకున్నదని వివరించారు.
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), రెడ్కోల సంయుక్తాధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ బజార్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పేరుతో సదస్సు నిర్వహించారు. విద్యుత్తు రంగ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, పరికరాల తయారీదారులు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఇందులో పాల్గొని విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టే ప్రాజెక్టులకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశంపై చర్చించారు.
ఈ సందర్భంగా సతీశ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం పెంపుపై తమ సంస్థ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు. విద్యుత్తు సామర్థ్య పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఈ రంగంలో వేగవంతమైన మార్పును తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. కార్యక్రమంలో బీఈఈ సంయుక్త సంచాలకుడు శ్యాంసుందర్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్ పీయుష్దత్ పాండే, టీఎస్ రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ ఎన్ జానయ్య తదితరులు పాల్గొన్నారు.