న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్ట్, డిసెంబర్ మధ్య 66 కోట్ల మోతాదుల కొవిడ్ టీకాలు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం దేశీయ టీకాల తయారీదారులను ఆదేశించింది. సవరించిన ధరల మేరకు డోసుకు కోవిషీల్డ్కు రూ.205, కొవాగ్జిన్కు రూ.215 చొప్పున చెల్లించనుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి 37.5 కోట్ల కోవిషీల్డ్, భారత్ బయోటెక్ నుంచి 28.5కోట్ల కొవాగ్జిన్ టీకాలను కేంద్రం డిసెంబర్ నాటికి కొనుగోలు చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు కంపెనీలు కలిసి 66 కోట్ల మోతాదులను ఆగస్ట్, డిసెంబర్ మధ్య సరఫరా చేయాలని ఉంటుందని, పన్నులన్నీ మినహాయించి రెండు టీకాలకు రూ.205, రూ.215 చెల్లించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
రెండు టీకాలను రూ.150 చొప్పున సేకరిస్తున్న కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ జూన్ 21 నుంచి కొత్త వ్యాక్సిన్ సేకరణ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిన తర్వాత ధరలను సవరించాలని సూచించింది. ఈ నూతన విధానం ప్రకారం.. కొత్త విధానంలో దేశంలోని ఔషధ తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 75శాతం మంత్రిత్వ శాఖ సేకరించనుంది. వ్యాక్సిన్ తయారీ సంస్థలను తమ ఉత్పత్తులు పెంచాలని కేంద్రం కోరింది. అయితే, తయారీదారులు ప్రతి మోతాదుకు రూ.150 చెల్లిస్తే పెట్టుబడులు పెట్టడం ఆచరణీయం కాదని పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. ఈ ప్రక్రియను వికేంద్రీకరించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో 50శాతం వ్యాక్సిన్లను సేకరించడానికి కేంద్రం గతంలో రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇచ్చింది.
అయితే, నిధులతో సహా సేకరణపై రాష్ట్రాలకు సమస్యలు ఉత్పన్నమవగా.. కేంద్రమే సేకరించి, రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ టీకా మార్గదర్శకాల సవరణను జూన్ 8న ప్రకటించారు. ఇందులో వ్యాక్సిన్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల్లో 25శాతం ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయించుకునేందుకు అవకాశం ఇచ్చింది. జూన్ 21 నుంచి అమలులోకి వచ్చిన సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం 18 నిండిన వారందరికీ ఉచితంగా టీకాలు సరఫరా చేస్తున్నది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వ్యాక్సిన్ డ్రైవ్లో 41.69 కోట్ల మోతాదులకుపైగా టీకాలు రాష్ట్రాలకు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.