న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటిరోజే రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తప్పుపట్టారు. వర్షాకాల సమావేశాల్లో రభస చేశారంటూ ఈ సమావేశాల్లో శిక్షించడం కరెక్ట్ కాదని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ తమ గళం వినిపించే హక్కు ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలని థరూర్ సూచించారు.
పార్లమెంట్ ఉన్నదే డిబేట్లు, డిస్కషన్ల కోసమని, సభ్యులందరూ తమ అభిప్రాయాలు వినిపించేందుకు అనుమతించాలని శశిథరూర్ కోరారు. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యబద్దమైన పార్లమెంట్ను నిజాయితీగా నడుపడం సాధ్యంపడుతుందని థరూర్ పేర్కొన్నారు.