నర్సంపేట, నవంబర్ 14: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నల్ల చట్టాలతో రైతు పరిస్థితి అధ్వానంగా మారుతుందని సినీనటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేట జయశ్రీ టాకీసులో ‘రైతన్న’ సినిమాను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి వీక్షించారు. అనంతరం నారాయణమూర్తి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు చట్టాలతో రైతులకు ముప్పు తప్పేలా లేదన్నారు. దీనివల్ల రైతులు వ్యవసాయ భూములను వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించుకోలేని దుస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో అమలవుతున్న ఆంక్షల వల్ల రైతుల పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడిసాయం, ఉచిత విద్యుత్తు, పంటల రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు.