Punjab | చండీఘర్: పంజాబ్లో అవినీతి, అక్రమాలు, లంచాలు, ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాల ఆరోపణలపై అవకాశం ఇస్తే విచారణ చేపడతామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పంజాబ్, హర్యానా హైకోర్టుకు తెలిపింది. పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం బదిలీ కోసం నగదు, సంస్థాగత అవినీతిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) హైకోర్టులో దాఖలైంది. లంచాలు బహిరంగంగా అడుగుతున్నారని, టెండర్లు, కాంట్రాక్టులు, లైసెన్సులు విషయాల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆ వ్యాజ్యంలో ఆరోపించారు.
చేంజ్ ల్యాండ్ యూజ్, ఇతర విషయాల్లో బిల్డర్లు, డెవలపర్లకు పంజాబ్ సీఎంవో సహకరిస్తుందని పిల్లో వెల్లడించారు. ఈ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన దర్యాప్తులో సీఎంవోలో భారీ అవినీతి జరిగిందని, సీనియర్ అధికారుల పోస్టింగ్స్లో అక్రమాలు చోటు చేసుకన్నాయని వెల్లడైంది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈడీ పంజాబ్ పోలీసులకు విన్నవించింది.
అయితే ఈ కేసు సీబీఐకి అప్పగించాలా వద్దా అనేది హైకోర్టు తన రాజ్యాంగపరిధిని దాటకుండా పరిశీలించాల్సిన అంశం అని సీబీఐ తెలిపింది. ఒకవేళ దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు అనుమతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు చేపడతామని వెల్లడించింది.
ఈ అవినీతి ఆరోపణలపై శిరోమణి అకాళీదళ్ (SAD), బీజేపీ వంటి ప్రతిపక్ష పార్టీలు సీబీఐతో దర్యాప్తు చేయించాలని గవర్నర్ను కోరాయి. పంజాబ్ ప్రభుత్వం సీబీఐ విచారణ డిమాండ్ను ఖండిచింది. కేంద్ర సంస్థలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని పంజాబ్ ప్రభుత్వం ఆరోపించింది.