న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడైన మెహుల్ చోక్సీపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. వజ్రాలు, ఆభరణాలను తాకట్టు పెట్టి మెహుల్ చోక్సీ ఐఎఫ్సీఐ నుంచి రూ.25కోట్ల రుణం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో మెహుల్ చోక్సీ, ఆయనకు చెందిన గీతాంజలి జెమ్స్, సూరజ్మల్ లల్లూభాయ్ అండ్ కో, నవేంద్ర జవేరి, ప్రదీప్ సి షా, శ్రేక్ షాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఐఎఫ్సీఐ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి వజ్రాలు, ఆభరణాలు తాకట్టు పెట్టి మెహుల్ చోక్సీ రూ.25 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకున్నట్లు ఐఎఫ్ సీఐ తన ఫిర్యాదులో పేర్కొంది.
నలుగురు వేర్వేరు అప్రైజర్లు ఆభరణాల విలువ రూ.34-45 కోట్లుగా ఇవ్వగా.. దీంతో ఐఎఫ్సీఐ చోక్సీకి రుణం ఇచ్చింది. కంపెనీ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లు, ఆభరణాలను విక్రయించి రికవరీ చేసుకున్నందుకు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో తాకట్టుపెట్టిన 20,60,054 షేర్లలో 6,48,822 షేర్లను ఐఎఫ్సీఐ రూ.4.07కోట్లు రివకరీ చేసుకున్నది. అయితే మెహుల్ చోక్సీ క్లయింట్ ఐడీని ఎన్ఎస్డీఎల్ బ్లాక్ చేయడంతో కంపెనీ మిగితా షేర్లను విక్రయించలేకపోయింది.
దీంతో ఐఎఫ్సీఐ బంగారం, వజ్రాలు, ఇతర ఆభరణాలను తనఖా పెట్టేందుకు చర్యలు చేపట్టగా.. వాటి విలువ వాల్యుయేషన్ కంటే దాదాపు 98శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది. తాకట్టు పెట్టిన నగలు, వజ్రాల విలువ రూ.70లక్షల నుంచి రూ.2కోట్ల వరకు మాత్రమే ఉంటుందని వెల్లడైంది. వజ్రాలు నాసిరకంగా ఉన్నాయని, ల్యాబ్లో తయారు చేసినట్లు గుర్తించారు. అలాగే తాకట్టు పెట్టిన రత్నాలు సైతం అసలైనవి కావని తేలింది. ఐఎఫ్సీఐ రుణాన్ని 2018లో నిరర్ధక ఆస్తిగా ప్రకటించింది. ఈ కేసులో కోల్కతా, ముంబై సహా ఎనిమిది ప్రాంతాల్లో సీబీఐ దాడులు జరుపుతూ నిందితులను గుర్తిస్తున్నది.