చెన్నై: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్లో శుక్రవారం కొత్తగా 11 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలో కరోనా బారినపడిన వారి సంఖ్య 182కు చేరింది. బుధవారం కరోనా కేసుల సంఖ్య 111 ఉండగా రెండు రోజుల్లో ఇది 182కు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా వ్యాప్తి కేంద్రంగా ఐఐటీ మద్రాస్ మారడం కలకలం రేపుతున్నది.
అయితే భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ జే రాధాకృష్ణన్ మీడియాతో అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ మూసివేతకు ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపారు. కరోనా మరింతగా వ్యాప్తి చెందకుండా క్యాంపస్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
మరోవైపు ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ జే రాధాకృష్ణన్ ఇటీవల ఐఐటీ మద్రాస్ను సందర్శించారు. చెన్నై జోనల్ వైద్య అధికారి కూడా ఆయన వెంట ఉన్నారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో వారు సమావేశమయ్యారు. క్యాంపస్లో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఆందోళన చెందవద్దని విద్యార్థులకు సూచించారు. సమీపంలోని మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ఆసుపత్రిని రిజర్వ్ చేసినట్లు చెప్పారు. కరోనా సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఎవరూ ఆసుపత్రిలో చేరలేదన్నారు.
కాగా, విద్యార్థులు, టీచింగ్ సిబ్బందికి ఐఐటీ మద్రాస్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని కోరింది. మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని కొనసాగించడం వంటి ప్రోటోకాల్స్ను తప్పక పాటించాలని సూచించింది.