భోపాల్: కాళీమాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ ఎంపీ మహువా మైత్రిపై మధ్యప్రదేశ్లోని భోపాల్లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 295ఏ సెక్షన్ కింద ఈ కేసును రిజిస్టర్ చేశారు. మతపరమైన భావాలను కించపరిచినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. హిందూ మతస్థుల మనోభావాలను ఎంపీ మహువా అవమానించారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. హిందూ దేవతల్ని కించపరచడాన్ని ఎప్పటికీ సహించబోమన్నారు.
కాళీదేవి సిగరేట్ స్మోకింగ్ చేస్తున్నట్లు ఫిల్మ్మేకర్ లీనా మనిమేకలై ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. దానికి ఎంపీ మహువా మద్దతు పలికింది. అంతేకాదు ఓ సమావేశంలో మాట్లాడుతూ కాళీ మధుమాంసాన్ని స్వీకరిస్తుందని అన్నారు. మాంసాన్ని తినడంతో పాటు మద్యాన్ని స్వీకరిస్తుందని ఆమె అన్నారు. ఒకవేళ మీరు భూటాన్ లేదా సిక్కిం వెళ్లే, అక్కడ కాళీకి పూజ చేస్తారని, అయితే వాళ్ల ఆ దేవతకు విస్కీని ప్రసాదంగా ఇస్తారని, ఒకవేళ యూపీకి వెళ్లి అక్కడ విస్కీని ప్రసాదంగా ఇవ్వమంటే అది నేరం అవుతుందని ఆమె అన్నారు.
కాళికాదేవి అంటే తనకు మాంసం తినే, మందు తాగే దేవతే అని అన్నారు. బెంగాల్లోని బీర్భమ్ జిల్లాలో ఉన్న తారాపీట్ శక్తిపీఠం వెళ్తే అక్కడ సాధువులు స్మోకింగ్ చేస్తూ కనిపిస్తారన్నారు. అక్కడి వాళ్లు కాళీని అలాగే పూజిస్తారని ఆమె అన్నారు. నేను హిందూ మతస్థురాలినేనని, కాళీ మాతను ఆరాధిస్తానని, కాళీని తనకు నచ్చినట్లు ఊహించుకుంటానని, అది నా స్వేచ్ఛ అని ఎంపీ మహువా మైత్రి తెలిపారు.
ఎంపీ మహువా మైత్రి చేసిన వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. వ్యక్తిగత హోదాలో కాళీపై ఎంపీ మహువా ఆ వ్యాఖ్యలు చేసినట్లు తృణమూల్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు పార్టీతో ఎటువంటి సంబంధంలేదని చెప్పింది. ఈ వివాదం నేపథ్యంలో టీఎంసీ ట్విట్టర్ను మహువా అన్ఫాలో అయ్యారు.