చండీగఢ్: కురుస్తున్న భారీ వర్షాలకు ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న మహిళ మృతదేహం లభించింది. అయితే గల్లంతైన కారు డ్రైవర్ ఆచూకీ ఇంకా లభించలేదు. అలాగే ఆ కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారు అన్నది కూడా తెలియలేదు. పంజాబ్లోని మొహాలీలో ఈ సంఘటన జరిగింది. హర్యానాలోని పింజోరికి చెందిన పూజ అనే మహిళ హిమాచల్ ప్రదేశ్కు వెళ్లేందుకు కారు బుక్ చేసింది. అయితే భారీ వర్షాలకు మొహాలీలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో పాటియాలా కీ రావు కాలువలో ఆ కారు కొట్టుకుపోయింది. డేమేజ్ అయిన కారు, కన్హే కా బారా గ్రామంలోని వంతెన వద్ద చిక్కుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, చండీగడ్ వద్ద పాటియాలా కీ రావు కాలువలో మహిళ మృతదేహం లభించింది. మృతురాలిని కారు బుక్ చేసిన పూజాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు గల్లంతైన కారు డ్రైవర్ 21 ఏళ్ల గౌరవ్ కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఆ కారులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో కూడా తెలియన్న పోలీసులు ముగ్గురు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతురాలు పూజ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.