ఓస్లో, ఏప్రిల్ 7: ఆహార పదార్థాల రుచి పెంచడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వినియోగించే ‘జాంతన్ గమ్’ రసాయనం కారణంగా (ఈ415) జీర్ణవ్యవస్థలో కీలకపాత్ర పోషించే గట్ మైక్రోబియోటాకు హాని కలుగుతున్నట్టు నార్వే శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రెడ్డు, కేకులు, ఐస్క్రీమ్లు, సలాడ్లు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండేందుకు, వాటి రుచిని పెంచేందుకు ‘జాంతన్ గమ్’ను వాడతారు. మిగతా ఆహార పదార్థాలలాగా ఈ జాంతన్ గమ్ జీర్ణంకాకుండా వ్యర్థాలతో కలిసి బయటకుపోతున్నట్టు ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు భావించారు. అయితే, క్లిష్టమైన మోనోసాకరైడ్స్ను జీర్ణమయ్యేలా చేసే గట్ మైక్రోబియోటా.. ఈ జాంతన్ గమ్ను కూడా ఆక్సీకరణం చెందిస్తున్నట్టు గుర్తించారు. ఇలా రూపాంతరం చెందిన జాంతన్ గమ్ మైక్రోబియోటాపైన చెడు ప్రభావం చూపడమే కాకుండా అనవసరమైన క్యాలరీలను కూడా పెంచుతున్నట్టు పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకొనే వారిలో ఈ ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు వెల్లడించారు. అయితే దీనిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉన్నదని వివరించారు.