‘నా కెరీర్లో ఇది భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ చిత్ర దర్శకుడితో ఏడేళ్లుగా ప్రయాణం సాగిస్తున్నా. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన తర్వాత చాలా మంది చేయొద్దన్నారు. అయినా నేను ఎందుకు చేశాను? ఈ సినిమా విషయంలో నా నమ్మకం ఏంటనేది విడుదల తర్వాత తెలుస్తుంది’ అన్నారు విశాల్. ఆయన కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మార్క్ ఆంటోని’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్.వినోద్ నిర్మించారు.
ఈ నెల 15న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో నితిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాల్ మాట్లాడుతూ ‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకులు పెట్టే డబ్బులకు న్యాయం జరుగుతుంది’ అన్నారు. ‘విశాల్ కోసమే ఈ కథ రాశాను. తండ్రీకొడుకుల కథ. విశాల్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. ఆయన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు’ అని దర్శకుడు తెలిపారు. తమిళంలో తనకిది రెండో చిత్రమిదని సునీల్ తెలిపారు.