హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో శనివారం వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు సందడిగా మొదలయ్యాయి. వచ్చే నెల 31 వరకు 45 రోజుల పాటు జరుగనున్న శిబిరాలను గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు, అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘క్రీడలతో ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుంది. మానసికంగా ధృడంగా తయారవుతారు. బాల్యం నుంచే పిల్లలకు క్రీడలపై ఆసక్తి కల్గిస్తే చాంపియన్లుగా తయారవుతారు’ అని అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, స్విమ్మింగ్, ఫుట్బాల్, స్కేటింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అడ్మినిస్ట్రేటర్ నందకిషోర్ గోకుల్ తెలిపాడు. ఈ కార్యక్రమంలో ఓయూ పీడీ రాజేశ్, వెంకన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.