నందిపేట్ : పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇచ్చి మాట మార్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతులు ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో రైతులు ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. పసుపు బోర్డు హామీకి సంబంధించిన బాండ్ పేపర్ ఫ్లెక్సీగా చేయించి ప్రదర్శిస్తున్నారు. ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని ఓట్లు వేయించుకొని ఇప్పుడు తప్పించుకుంటున్నాడని, రైతులను మోసం చేసిన ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎంపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసేవరకూ తాము ఉద్యమిస్తామని, రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని రైతులు వెల్లడించారు.