కంటోన్మెంట్ ప్రజల కష్టాలు తెలుసుకోకుండా పిచ్చివ్యాఖ్యలు
మీడియా పాయింట్లోఎమ్మెల్యేలు
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ది రాజకీయాలకు పనికిరాని చిల్లర వ్యక్తిత్వం అని ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, జ్ఞాని సాయన్న, మాగంటి గోపీనాథ్ విమర్శించారు. అసెంబ్లీ మీడియాపాయింట్లో సోమవారం వారు మాట్లాడారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల కష్టాలు తెలుసుకోకుండా బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని సాయన్న మండిపడ్డారు. మిలటరీ అంటే సీఎం కేసీఆర్కు ఎంతో ప్రేమ ఉన్నదని, దేశం కోసం ప్రాణాలర్పించిన కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ఇవ్వడంతోపాటు ఆయన భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి గౌరవించిన విషయాన్ని గర్తుచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జార్ఖండ్ వెళ్లినప్పుడు ఇద్దరు సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం చేశారని ఉద్ఘాటించారు. కంటోన్మెంట్ ప్రజలు పడుతున్న యాతన పట్టించుకోకుండా బండి సంజయ్ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. కంటోన్మెంట్ రోడ్లు నిజాం కాలంలో వేసినవేననే విషయాన్ని తెలుసుకోవాలని హితవుపలికారు. ‘నువ్వు ఎంపీ అవడం కరీంనగర్ ఖర్మ.. బీజేపీ అధ్యక్షుడివి కావడం ఆ పార్టీ కార్యకర్తల ఖర్మ’ అని అన్నారు.