సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): జావాను హైదరాబాద్ నగరానికి తీసువచ్చిన క్లాసిక్ లెజెండ్స్ సంస్థ తాజాగా బ్రిటన్కు చెందిన బీఎస్ఎ మోటార్ సైకిల్స్ను నగరానికి పరిచయం చేయనుంది. మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ ద్వారా ఇప్పటికే జావా మోటార్ సైకిళ్లను తయారు చేసి విక్రయిస్తోంది. తాజాగా ఐకానిక్ బ్రిటిష్ బ్రాండ్ అయిన బీఎస్ఏని పునరుద్దరించడం లక్ష్యంగా పెట్టుకొని, దీనికి సంబంధించిన హక్కులను కొనుగోలు చేసింది. మార్కెటింగ్ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో హైదరాబాద్లో బీఎస్ఏ బ్రాండ్తో మోటార్ సైకిళ్లను క్లాసిక్ లెజెండ్స్ సంస్థ ఆధ్వర్యంలో షోరూంలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. త్వరలోనే దీనికి సంబంధించిన షోరూంలను నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సోషల్ మీడియో సైట్లో తెలిపింది. మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా సైతం కొత్త బీఎస్ఏ మోటర్ సైకిళ్లను సరికొత్త అవతారంలో పరిచయం చేయనున్నామని ట్వీట్ చేశారు.