రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS ) అభ్యర్థులను గెలిపించాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ (Bahrain ) శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. బహ్రెయిన్లోని అండాలస్ గార్డెన్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. వందరోజుల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పంటలకు నీరందక రైతులు, తాగునీరు అందక సతమతమవుతున్నారని పేర్కొన్నారు.
పేదలకు పింఛన్లు (Pensions) అందడం లేదని ఎన్నికల ప్రచారంలో అధినేత కేసీఆర్ (KCR) కు లబ్దిదారులు మొరపెట్టుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని తెలిపారు. పదేండ్లు కరువు లేదు. నిండా నీటితో జలాశయాలు. కాంగ్రెస్ పాలన (Congress rule) లో నాలుగు నెలలకే మళ్లీ కరువును చూస్తున్నాం.
కాంగ్రెస్ మార్పు తెస్తామంటే నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే పాలన చేతగాక చేతులెత్తేసారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. పార్లమెంట్లో తెలంగాణ గళం విప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు పుప్పాల బద్రి, అన్నారం సుమన్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, బొలిశెట్టి ప్రమోద్, చిలుకూరి రాజలింగం, మరుపాక దేవయ్య , తిప్పారవేణి శ్రీనివాస్ , మెరుగు శ్రీనివాస్, కొందరి రాజేందర్, పెనుగొండ శ్రీకాంత్ , కోటగిరి శ్రీనివాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు.