హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలు మాని, ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలుచేయాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిషరించాల్సిన ప్రభుత్వం.. వారిపై ఎదురుదాడి చేయడం దురదృష్టకరమని విమర్శించారు.
ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం కూడా ఎదురు ఉద్యమాలు చేయాలని సీఎం పిలుపునివ్వడం సరికాదని, శాంతిభద్రతల సమస్య తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వంద రోజుల్లో హామీలు అమలుచేస్తామని చెప్పి.. వెయ్యి రోజులవుతున్నా నెరవేర్చకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సమస్యలపై ఉద్యోగులు న్యాయబద్ధంగా పోరాడుతున్నారని, వాటికి సమాధానం చెప్పకుండా వారిపై సీఎం ఎదురుదాడి చేయడం అమానుషమని ధ్వజమెత్తారు. ఉద్యోగుల సమస్యల పరిషారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యోగుల జాక్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.