జిన్నారం, మార్చి 21: హైదరాబాద్లో భారీ డ్రగ్స్ తయారీ బండారం బద్దలైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలోని లూసెంట్ డ్రగ్స్ కంపెనీలో పెద్దఎత్తున డ్రగ్స్ తయారుచేసి ఏకంగా పాకిస్థాన్కు తరలిస్తున్నట్టు బెంగళూరుకు చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సోదాల్లో వెల్లడైంది. డెన్మార్క్, జర్మనీ, మలేసియాకు ట్రమడాల్ ఎగుమతి చేసేందుకు ఎన్వోసీ పొందిన కంపెనీ 2021లో పాక్కు అక్రమంగా 25 వేల కిలోల ట్రమడాల్ను చేరవేసింది. ఈ ట్రమడాల్ను హెరాయిన్ తయారీకి ఉపయోగిస్తారు. అంతేకాకుండా హెరాయిన్ తయారీలో కీలకపాత్ర వహించే ఎసిటిక్ ఆన్హైడ్రైడ్ ప్రకటిత నిల్వల్లో 3.85 కిలోల మేర తేడా రావడం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసినట్టు తెలుస్తున్నది. లూసెంట్ డ్రగ్స్ పరిశ్రమలో మూడ్రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్సీబీ బృందం పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, మరో ముగ్గురు కెమిస్టులను మార్చి 18న అరెస్టు చేసి భారీస్థాయిలో డ్రగ్స్ను పట్టుకున్నట్టు సమాచారం. నిందితులను కోర్టులో హాజరు పరచి జుడీషియల్ కస్టడీకి పంపారు. గతేడాది 2021లో 25 వేల కిలోల ట్రమడాల్ డ్రగ్ను పాకిస్థాన్కు ఎగుమతి చేసినట్టు గుర్తించిన అధికారులు.. డ్రగ్ను ఎంతమేరకు తయారు చేశారు? ఎక్కడెక్కడికి సరఫరా చేశారు? అనే కోణంలో అదుపులో ఉన్నవారిని ప్రశ్నిస్తున్నారు. లూసెంట్ పరిశ్రమలో అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారనే వార్త స్థానికంగా సంచలనం కలిగించింది. హైదరాబాద్ నార్కోటిక్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.