Britan : బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ ఈ వారంలో తైవాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా పార్లమెంటరీ కమిటీ తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్ వెన్తో పాటు సీనియర్ అధికారులను కలుస్తారని బ్రిటన్ విదేశీ వ్యవహారాల కమిటీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పర్యటనలో పార్లమెంటరీ కమిటీ ఇండో ఫసిఫిక్ దేశాల్లో బ్రిటన్ విదేశీ విధానం మీద ప్రధానంగా దృష్టి పెట్టనుంది. అంతేకాదు తైవాన్తో ఆర్థిక, దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఈ పర్యటన దోహదపడనుంది. ‘తైవాన్ పర్యటనకు వెళ్లడం అనేది విదేశీ వ్యవహారాల కమిటీ ప్రాధాన్యాల్లో ఒకటి’ అని ఈ కమిటీ ఛైర్పర్సన్ అలిసియా కియర్న్స్ తెలిపింది.
చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఈ ఏడాది మొదట్లో అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించారు. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ తైవాన్కు వెళ్లనుండడంతో చైనా ఏ విధంగా స్పందిచనుందో చూడాలి. ఎందుకంటే.. తైవాన్ విషయంలోనే కాకుండా పలు అంశాల మీద బ్రిటన్, చైనా విభేదిస్తూనే ఉన్నాయి. పార్లమెంటరీ కమిటీ అనేది ప్రభుత్వ విధానాలు, కొత్త చట్టాలు, ఆర్థిక విషయాలను పర్యవేక్షిస్తుంది. ఇందులో హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్కు చెందిన సభ్యులు ఉంటారు.