ఖైరతాబాద్, డిసెంబర్ 6 : భర్త, బిడ్డతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆ గృహిణికి అదే చివరి రోజైంది. వాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో బిడ్డను కాపాడుకొని తాను బలైంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం, వెలిమినీడు గ్రామానికి చెందిన ఎ.అశ్విని (23)కు భర్త శ్రీను, తొమ్మిది నెలల పాప ఉంది. శ్రీను బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈనెల 2న భర్త, పాపతో కలిసి బైకుపై యాదాద్రి- భువనగిరి జిల్లాలోని తన తల్లిగారింటికి బయలుదేరారు. మార్గమధ్యలో బైక్ అదుపుతప్పడంతో అందరూ కిందపడిపోయారు. తొమ్మిది నెలల పాపకు దెబ్బతగలకుండా చేతులతో పట్టుకొని అశ్విని కిందపడిపోయింది. భర్త, పాపకు స్వల్పగాయాలు కాగా, ఆమె తలకు తీవ్రగాయమైంది. చికిత్స నిమిత్తం నాంపల్లిలోని కేర్ దవాఖానకు తరలించారు. ఈనెల 5న బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులను కలిసిన జీవన్దాన్ ప్రతినిధులు అవయదానం విశిష్టతను వారికి వివరించగా అంగీకరించారు. ఎంతో ఆరోగ్యవంతురాలిగా ఉన్న అశ్విని శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కండ్లు సేకరించారు.