కోనరావుపేట, మే 13 : రేబిస్ బారినపడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాలు.. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన లోకుర్తి రాజు, మమత దంపతులకు కొడుకు నిశాంత్(11), కూతురు ఉన్నారు. ఉపాధి కోసం రాజు సౌదీ వెళ్లగా, మమత ఇంటి వద్దే బీడీలు చుడుతున్నది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. కొడుకు నిశాంత్ ఐదోతరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో గత నెల 23న ఇంటి ముందు స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా పిచ్చికుక్క దాడి చేసింది. తల, కన్ను భాగంలో తీవ్రంగా గాయపరిచింది.
వెంటనే సిరిసిల్లలోని ప్రభు త్వ దవాఖానకు తీసుకెళ్లారు. ఈ నెల 7న నిశాంత్కు జ్వరం రాగా వైద్యం చేయించారు. అదే రోజు రాత్రి నిశాంత్ రాత్రంతా నిద్రపోకపోవడంతో హైదరాబాద్లోని నిలోఫర్కు తరలించారు. వైద్యులు బాలుడికి రేబిస్ వ్యాధి సోకిందని నిర్ధారించి చికిత్స అందించారు. బుధవారం సాయంత్రం పరిస్థితి విషమించి మృతి చెందగా, తల్లి మమత గుండెలవిసేలా రోదించింది.