న్యూఢిల్లీ: పలు కీలక అంశాలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలో సమావేశం కాబోతున్నది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పలు టోర్నీల నిర్వహణతో పాటు వచ్చే ఏడాది జరిగే
వన్డే ప్రపంచకప్ కోసం నిర్వహణ కమిటీ విషయంలో చర్చ జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2న
వర్చువల్ విధానంలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీ జరుగనుంది. ఇందులో కర్నల్ సీకే నాయుడు అండర్-25
టోర్నీతో పాటు మహిళల సీనియర్ టీ20 చాంపియన్షిప్ నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా విజృంభణ
కారణంగా గతేడాది ఈ రెండు టోర్నీలు వాయిదా పడ్డాయి. మొత్తం 14 పాయింట్ల ఎజెండాతో జరుగనున్న అపెక్స్
కౌన్సిల్ సమావేశంలో 2023 వన్డే ప్రపంచకప్ నిర్వహణపై ఎల్వోసీ(లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ)ని ఏర్పాటు
చేయనున్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉన్నా..కరోనాతో యూఏఈలో
జరుపాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే టీమ్ఇండియా స్పాన్సర్ బైజూస్తో కాంట్రాక్టు వచ్చే నెల 31తో ముగుస్తున్న
నేపథ్యంలో దీనిపై కూడా చర్చ జరుగనుంది. ధీరజ్ మల్హోత్రా వైదొలుగడంతో గేమ్ డెవలప్మెంట్ జీఎం నియామకం,
జూన్లో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్, పురుషుల, మహిళా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టులు, లైంగిక
వేధింపులపై పాలసీ, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల ఆతిథ్య ఫీజు పెంపు, ఎన్సీఏలో స్పోర్ట్స్ సైన్స్ హెడ్ నియామకం,
పూర్వాంచల్ క్రికెట్ అసోసియేషన్ ప్రాతినిధ్యానికి ఆమోదంపై అపెక్స్ కౌన్సిల్లో చర్చకు రానున్నాయి.