న్యూఢిల్లీ: కరోనా కల్లోలంలో తాజాగా వినిపిస్తున్న మాట భ్లాక్ ఫంగస్. తెలుగులో నల్లని బూజు లేదా శిలీంధ్రం. కోవిడ్ బారిన పడినవారికీ, ఇతర జబ్బులకు గురైనవారికీ అందరికీ ఇది సోకుతున్నది. అహ్మదాబాద్ లో 300 దాకా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఈ ఫంగస్ లేదా బూజు వ్యాపించడానికి అపరిశుభ్రమైన వాతావరణం కారణమంటున్నారు.
ఈ ఫంగస్ వల్ల సోకే వ్యాధిని మ్యూకర్ మైకోసిస్ అని పిలుస్తున్నారు. ఇది ముక్కులోంచి శరీరంలోకి ప్రవేశించి మెదడును నాశనం చేస్తుంది. దీని చికిత్సలో సర్జరీ, అనేక మందులు వినియోగిస్తున్నారు. ఇది సోకినవారిలో మరణాల శాతం కూడా ఎక్కువే ఉంటున్నది. ముందుగా అది సైనస్ లోనికి, అక్కడి నుంచి మెదడు దిగువ భాగానికి చేరుకుంటుంది. మెదడును పట్టేసిన తర్వాత చికిత్స కష్టమే. మన రోగనిరోధకత తగ్గినప్పుడు ఈ ఫంగస్ తన ప్రతాపం చూపిస్తుంది. ఈ ఫంగస్ కోవిడ్ రోగులలో ఎక్కువగా ఎందుకు కనిపిస్తున్నది? ఓవైపు వైరస్ తో జబ్బుపడి ఉంటారు. పైగా వారికిచ్చే స్టెరాయిడ్ల వల్ల రోగనిరోధకత తగ్గుతుంది. ఇదంతా ఫంగస్కు అనుకూలంగా ఉంటుంది.
డయాబెటిస్ ఉన్న కరోనా రోగులకు ఈ ఫంగస్ ముప్పు ఎక్కువ అని వైద్యనిపుణులు అంటున్నారు. క్రిక్కిరిసిన ఆస్పత్రుల్లోని అపరిశుభ్రమైన వాతావరణం ఈ ఫంగస్ వ్యాప్తికి తోడ్పడుతున్నది. కళ్లలో, ముక్కులో నొప్పి, ఎర్రబడడం, జ్వరం, తలనెప్పి, రక్తపు వాంతులు, ముక్కులో నుంచి రక్తం కారడం, పంటినెప్పి, చూపు మందగించడం వంటి లక్షణాలు ఈ ఫంగస్ వల్ల వస్తాయి. ఇది సోకితే యాంటీ ఫంగల్ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అవి తీవ్ర ప్రభావం చూపుతాయి.
అలాగే ముక్కులో, సైనస్లో నిండిపోయిన ఫంగస్ ను తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాలి. ఫంగస్ మెదడు కిందిభాగంలో చేరినప్పుడు శస్త్రచికిత్స క్లిష్టంగా ఉంటుంది. మట్టి, బూజు, ఎరువు పేడతో పనిచేస్తున్నప్పుడు బూట్లు, నిండైన దుస్తులు, గ్లౌజ్ వేసుకోవాలని భారతీయ వైద్య పరిశోధనా సంస్థ సూచించింది. వ్యక్తిగతం పరిశుభ్రత పాటించాలి. మధుమేహం ఉన్నవారు దానిని నియంత్రించుకోవాలి. వైద్యులు స్టెరాయిడ్ల ఉపయోగాన్ని వీలైనంత త్వరలో ఆపేయాలని మండలి పేర్కొన్నది.