జీవితాలతో పక్కా రాజకీయం.. తెలంగాణలో వరిసాగు విస్తీర్ణంపై రాష్ట్రప్రభుత్వం అతిశయోక్తి చెప్తున్నదంటూ మొదట అవమానించిన కేంద్రప్రభుత్వం, శాటిలైట్ లెక్కల్లో రాష్ట్రం లెక్కే కరెక్ట్ అని తేలటంతో ఇప్పుడు మరో బుకాయింపు మొదలుపెట్టింది. తెలంగాణలో ఎకరాకు వరి ధాన్యం దిగుబడి 13 క్వింటాళ్లకు మించి రాదని రాష్ట్ర రైతులను కించపరుస్తున్నది. తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచి, రాష్ట్రప్రభుత్వాన్ని బద్నాం చేసే దుష్ట రాజకీయాన్ని మరింత బలంగా ముందుకు తీసుకుపోతున్నది.
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం, దిగుబడులపై కేంద్రం తప్పుడు లెక్కలు చెప్తున్నది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోకుండా, ఏసీ రూముల్లో కూర్చొని బ్యూరోక్రాట్లు వేసిన అంచనాలే కొలమానంగా తీసుకొని రాష్ట్ర రైతుల శక్తిసామర్థ్యాలనే శంకిస్తున్నది. ధాన్యం సేకరణ నుంచి తప్పించుకొనేందుకు రాష్ట్రప్రభుత్వంపైనా, రైతాంగంపైనా నిందలేస్తున్నది. మొన్నటిదాకా వరిసాగు విస్తీర్ణంపై పేచీ పెట్టిన కేంద్రం, ఇప్పుడు ధాన్యం దిగుబడిపై కొత్త పేచీ లేవనెత్తింది. వాస్తవానికి రాష్ట్రంలో ఈ వానకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యింది. కేంద్రం మాత్రం అంత భారీ విస్తీర్ణంలో వరిసాగు లేదని పదేపదే ప్రకటనలు చేసింది.
దీంతో నిజమైన లెక్కలను మీరే తేల్చండని రాష్ట్రం డిమాండ్ చేయటంతో శాటిలైట్ ద్వారా సర్వే చేయించి 58.66 లక్షల ఎకరాల్లో (23.74 లక్షల హెక్టార్లలో) వరి సాగయ్యిందని వెల్లడించింది. రాష్ట్రం చెప్పిన లెక్కకు ఇది దాదాపు 95% సరిపోలింది. రాష్ట్రంలో ఎకరాకు ఎంత ధాన్యం దిగుబడి వస్తుందని ఏ రైతును అడిగినా 25 క్వింటాళ్లకుపైగా అని టక్కున చెప్తారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 30 క్వింటాళ్ల వరకు కూడా వస్తుంది. కేంద్రం మాత్రం వాస్తవాలను తొక్కిపెట్టి, టెక్నాలజీ పేరుతో ధాన్యం దిగుబడి అంచనాలను పూర్తిగా తగ్గించింది. ఎకరాకు కేవలం 13 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుందని శాటిలైట్ సర్వే ద్వారా తేల్చింది.
ఈ లెక్కన తెలంగాణలో 58.66 లక్షల ఎకరాల్లో వరి సాగైతే 75.43 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని తెలిపింది. అత్యంత దుర్భర పరిస్థితుల్లోనూ ఇంత తక్కువ దిగుబడి రాదు. ఈ కనీస విషయానికి కూడా కేంద్ర పెద్దలు మసిబూసి మారేడుకాయ చేస్తుండటం గమనార్హం. కేంద్రం చెప్పిన సాగు విస్తీర్ణం లెక్కల ప్రకారమే వాస్తవ దిగుబడులను పరిగణనలోకి తీసుకొంటే రాష్ట్రంలో 1.46 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తది. కానీ ధాన్యం సేకరణ బాధ్యత నుంచి తప్పించుకొనేందుకు అడ్డగోలు అంచనాలతో దిగుబడిని సగానికి సగం తగ్గించింది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఈ వానకాలంలో 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అంగీకరించింది. మిగిలిన ధాన్యం సేకరణపై ప్రశ్నిస్తే దాటవేత ధోరణి అవలంబిస్తున్నది.