హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏపీ బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. శనివారం రాత్రి విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుల్లో బీజేపీ నాయకులు ‘ఆరేసుకోబోయి.. పారేసుకున్న..’ పాటకు మహిళలతో కలిసి చిందులు వేశారు. దేశభక్తి, క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకొనే ఆ పార్టీ నేతలు తమ కార్యాలయంలో మహిళలతో కలిసి అభ్యంతరకరంగా చిందులు వేయడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఏపీలోని మహిళా సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ అంశంపై ఏపీతో పాటు తెలంగాణలోనూ రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరేసుకోబోయి పారేసుకున్న పాటకు డాన్స్ వేసిన నేతల తీరు ఆ తర్వాత ఉరేసుకో అన్న చందంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తన శైలిలో చమత్కరించారు.