బెంగళూరు: కర్ణాటక బీజేపీ మంత్రి ఆనంద్సింగ్ సోమవారం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్తో తన నివాసంలో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఆనంద్ సింగ్ బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతున్నది. అయితే మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్టు ఇరువురు నేతలు పేర్కొన్నారు. మంత్రుల ఇంచార్జ్ బాధ్యతల్లో మార్పులు చేస్తూ సీఎం బొమ్మై ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ఆనంద్సింగ్ అసంతృప్తిగా ఉన్నారు. తమ సొంత జిల్లాలను తప్పించి తమకు రాజకీయంగా ప్రాధాన్యంలేని జిల్లాలకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించడంపై మరికొందరు మంత్రుల కూడా గుర్రుగా ఉన్నారు. త్వరలోనే పలువురు రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్లోకి జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది.