హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశ జనాభాలో 70 కోట్ల మంది ఉన్న బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి ఓట్లు వేయవద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. రాజకీయ, ఉద్యోగ, విద్యారంగాల్లో రిజర్వేషన్లు పెరగడానికి అనుకూలంగా ఉండే బీసీ కుల గణనను కావాలనే కేంద్రం అడ్డుకుంటున్నదని విమర్శించారు. బీసీ కుల గణన చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్లోని సెంట్రల్ కోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్ టే బుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు న్యాయం కోసం నాలుగు ప్రధాన డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వీటిని పరిష్కరించకుండా వచ్చే ఎన్నికల్లో బీసీలను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దేశ జనాభాలో 70 కోట్ల మంది ఉన్న బీసీల కుల గణన వెంటనే చేపట్టాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నేత వీ హ నుమంతరావు, సీపీఐ జాతీయ కన్వీనర్ అజీజ్పా షా, చాడ వెంకట్రెడ్డి, బీసీ వర్గాలకు చెందిన ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లు, ఉద్యోగ సంఘాల నేతలు దాన కర్ణాచారి, కుమారస్వామి, వెంకటన్నగౌడ్, శ్రీనివాస్గౌడ్, కరుణాకర్, సురేందర్, కృష్ణుడు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.