బెంగళూరు, నవంబర్ 12: బిట్కాయిన్ కుంభకోణం నిందితుడు జన్ ధన్ ఖాతాలను హ్యాక్ చేసి ఒక్కో ఖాతా నుంచి రూ.2 చొప్పున సుమారు రూ.6,000 కోట్లు బదిలీ చేశాడని కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. ఈ విషయం కప్పి పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. బిట్కాయిన్ కుంభకోణం కర్ణాటకను కుదిపేస్తున్నది. బెంగళూరుకు చెందిన శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి అనే హ్యాకర్ నుంచి రూ.9 కోట్ల విలువైన బిట్కాయిన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ పోర్టళ్లను కూడా అతను హ్యాక్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
బిట్కాయిన్ స్కాంలో సీనియర్ బీజేపీ నాయకులు, వారి కుటుంబసభ్యులు, సీనియర్ అధికారుల ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో బసవరాజ్ సీఎం బొమ్మై గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అనంతరం బొమ్మై విలేకరులతో మాట్లాడుతూ బిట్కాయిన్ స్కాం గురించి ప్రధాని వద్ద ప్రస్తావించబోగా ఆ విషయంపై ఆందోళన చెందవద్దని చెప్పారని తెలిపారు. ఇది బొమ్మై నాయకత్వానికి ప్రధాని నుంచి ఉన్న బలమైన మద్దతును ప్రతిఫలిస్తుందంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే, రాష్ట్రంలో బిట్కాయిన్ స్కాం ఆరోపణలను పట్టించుకోవద్దని బొమ్మైకు మోదీ చెప్పడం సరైనదేనా అని కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ప్రశ్నించారు. ‘బొమ్మై ప్రస్తుత సీఎం. గతంలో బీఎస్ యెడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు హోంమంత్రిగా పనిచేశారు. దర్యాప్తు ఈ దశలో ఉండగా ఆరోపణలను పట్టించుకోవద్దని ప్రధాని చెప్పడం ఏంటి? దర్యాప్తును నిలిపేయాలని ఆయన చెబుతున్నారా’ అని ప్రశ్నించారు. ఈ స్కాంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ స్కామ్ సీఎం బసవరాజ్ బొమ్మై పదవికి ఎసరు పెడుతుందని, 2008-13లో మాదిరిగా బీజేపీ ప్రభుత్వం మూడో సీఎంను చూస్తుందని కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యానించారు.