ఇల్లందకుంట రూరల్: హుజూరాబాద్లో ఏంచేసినా తమ పాచిక పారట్లేదన్న నైరాశ్యంతో బీజేపీ నాయకులు ఇల్లందకుంట మండ లం సిరిసేడులో కొత్త లొల్లికి తెరదీశారు. గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున కేంద్రమంత్రి కిషన్రెడ్డి రోడ్షో నిర్వహించారు. ప్రచారం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయం వద్దకు చేరుకోగానే బీజేపీ శ్రేణులు సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఈటలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే బీజేపే నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి యత్నించారు. పోలీసులు వారించినా వినకుండా బీజేపీ శ్రేణులు గొడవకు దిగారు. టీఆర్ఎస్ కార్యకర్తలు సహనంతో ఉండి బీజేపీ కుట్రకు చెక్పెట్టారు. బీజేపీ శ్రేణుల దాడి యత్నాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో అబద్ధాలను ప్రచారంచేశారు. కేంద్ర మంత్రిపై టీఆర్ఎస్ నేతలు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.
తేదీ 2020 అక్టోబర్ 27
లేనిది ఉన్నట్టు.. జరగనిది జరిగినట్టు.. ప్రచారం చేసుకోవడంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను మించినవారే లేరు. గిల్లి జగడం పెట్టుకునే ప్రయత్నం చేయడం, తీరా ఎత్తు పారకపోతే.. అయ్యో మమ్మల్ని ఏదో చేశారంటూ మీడియాలో ప్రచారం పొందేందుకు గగ్గోలు పెట్టడం బండికి అలవాటే. ఎన్నికైనా, ఉప ఎన్నికైనా ఇదే తరహా ప్రచారాలకు తెరతీస్తూ ప్రజల చెవుల్లో ‘పువ్వులు’ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి సాక్షిగా శుక్రవారం మరో ఎపిసోడ్కు తెరతీశారు. ఇల్లందకుంట మండలం సిరిసేడులో కిషన్రెడ్డి రోడ్షోలో వ్యూహాత్మకంగానే సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేయిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలను కవ్వించే ప్రయత్నాలు చేశారు. పోలీసులు ఆపేందుకు ప్రయత్నించడంతో తనదైన శైలిలో అబద్దపు ప్రచారానికి పూనుకున్నారు.
-హైదరాబాద్, నమస్తే తెలంగాణ
ప్రచారం: దుబ్బాక ఉపఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు బంధువు అంజన్రావు ఇంట్లో భారీగా నగదు దొరికింది. దీనిని పోలీసులే పెట్టారంటూ బండి సంజయ్ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు.
జరిగింది ఇదీ: ఉపఎన్నిక సమయంలో ఓటర్లకు పంచేందుకు తన బంధువు ఇంట్లో రఘునందన్రావు రూ.18.67 లక్షలు దాచారు. పోలీసుల తనిఖీల సమయంలో ఆయన బంధువు అంజన్రావు స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించారు. తమ బండారం బయటపడటంతో బండి సంజ య్ కొత్త డ్రామాకు తెరతీశారు. కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్తో సిద్దిపేటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు వద్దన్నప్పటికీ సిద్దిపేటకు వెళ్లారు. పోలీసులు అరెస్టు చేయడంతో కావాలనే తమను పోలీసులు అడ్డుకున్నారని కొత్త రాగం అందుకున్నారు.
తేదీ 2020 నవంబర్ 30
ప్రచారం: నెక్లెస్ రోడ్లో చాయ్ తాగేందుకు వెళ్లగా తన కారుపై ముస్లింలు దాడి చేశారంటూ బండి సంజయ్ రచ్చ చేశారు.
జరిగింది ఇదీ: మరి కొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ పోలింగ్ జరుగుతుందనగా బండి సంజయ్ కావాలనే వివాదాన్ని సృష్టించారు. నెక్లెస్ రోడ్లో టీఆర్ఎస్ కార్యకర్తలున్న చోటికి పలువురు బీజేపీ నాయకులు కారులో వెళ్లి రెచ్చగొట్టారు. డబ్బులు పంచుతున్నారని అప్రమత్తమైన టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అక్కడ కారులో బండి సంజయ్ లేకున్నా తనపై దాడి జరిగిందంటూ అబద్ధపు ప్రచారం చేసుకున్నారు.
తేదీ 2021 ఫిబ్రవరి7
ప్రచారం: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని గుర్రంబోడులో పోడు భూములకు సంబంధించి గిరిజనులకు పరామర్శ పేరిట భరోసాయాత్ర చేపట్టడం.
జరిగింది ఇదీ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గిరిజనులకు భరోసాయాత్ర పేరిట గుర్రంబోడుపై దండయాత్ర చేపట్టారు. అల్లర్లు సృష్టించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు అక్కడ ఉన్న పోలీసు అధికారులు, గిరిజనులపై దాడులకు దిగారు. కాషాయ మూకల దాడుల్లో ఆరుగురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడగా, చాలామంది గిరిజనులు గాయపడ్డారు.