ఇండియన్ వేల్స్: స్టార్ టెన్నిస్ ప్లేయర్ నవోమీ ఒసాక (జపాన్)కు చేదు అనుభవం ఎదురైంది. స్టాండ్స్లోని ఓ మహిళ అసభ్య పదజాలంతో దూషించడంతో ఒసాక కోర్టులోనే కన్నీటి పర్యంతమైంది. ఈ అవమానంతో ఇండియన్ వేల్స్ మాస్టర్స్ టోర్నీ తొలి రౌండ్లోనే ఈ జపాన్ స్టార్ ఇంటిదారి పట్టింది. డబ్ల్యూటీఏ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆదివారం వెరోనిక (రష్యా)తో ఒసాక తలపడింది. తొలి సెట్ కొనసాగుతున్న సమయంలో ‘ఒసాకా…. ’అంటూ స్టాండ్స్లోని ఓ మహిళ అసభ్య పదజాలంతో దూషించింది. మ్యాచ్లో నిమగ్నమైన ఒసాక ఈ పరిణామంతో నిర్ఘాంతపోయింది. వెంటనే అంపైర్ను సంప్రదించి ఏం జరిగిందో చెప్పాలని పట్టుబట్టింది. ‘ఆమెవరో తెలియదు.. ఆమెపై చర్యలు తీసుకోలేం’అని అంపైర్ చెప్పడంతో ఒసాకా బాధతో రోదిస్తూ కూర్చుండిపోయింది. నిర్వాహకులు సుదీర్ఘ చర్చలు జరిపారు. ‘మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే.. ఆమెను గుర్తిస్తాం’అని నిర్వాహకులు పేర్కొనడంతో మ్యాచ్ కొనసాగింది. మ్యాచ్ ముగిసిన అనంతరం హాజరైన ప్రేక్షకులను ఉద్దేశించి మైక్రోఫోన్లో ఒసాకా గద్గద స్వరంతో మాట్లాడుతూ.. ‘గతంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా. అప్పుడు నన్ను బాధించలేదు. ఇప్పుడు జరిగిన సంఘటన తీవ్రంగా బాధించింది. గతంలో పలువురిని దూషించిన సంఘటనల వీడియోలు చూశా. మీరు ఒకసారి చూడండి. కానీ ఎందుకు ఇలా..? నేనేమీ ఏడవాలని అనుకోవడం లేదు’అని చెప్పింది. ఈ సంఘటనతో ఆత్మైస్థెర్యం కోల్పోయిన ఒసాకా 0-6, 4-6తో మ్యాచ్ను చేజార్చుకుంది.