ఎంత ఎదిగినా సామాన్యుడిలా ఒదిగి ఉంటాడన్నది రక్షణ దళాల అధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్ విషయంలో చిన్న మాట. కన్న ఊరుపై ఆయనకు అలవికాని అనురాగం. బంధువుల ఊర్లన్నింటిపై పేగు బంధంతో పెనవేసుకున్న ప్రేమ. భారత సైన్యంలో అత్యున్నత స్థానానికి చేరుకోవటమే కాదు, రక్షణ దళాలకు అధిపతిగా నియుక్తుడైనా.. మానవీయ విలువలకు ప్రాధాన్యమిచ్చిన మానవతావాది. దేశ రక్షణ కోసం ఏ బాధ్యతలు స్వీకరించినా తనదైన ముద్ర వేశారు. విధి నిర్వహణలో భాగంగా పనిచేసిన చోటల్లా ప్రజల హృదయాలను గెల్చుకున్నారు రావత్. ఆయన నాలుగు దశాబ్దాల మిలిటరీ జీవితంలో ఎక్కువకాలం జమ్మూకశ్మీర్, ఈశాన్యరాష్ర్టాల్లో పని చేసి స్థానిక ప్రజల్లో ఒకరిగా ఒదిగిపోయారు.
ఉత్తరాఖండ్ గర్వాల్ జిల్లాలో బిర్మొలిఖల్ అనే కుగ్రామంలో జన్మించిన రావత్కు తన సొంతూరుపై అంతులేని మమకారం. భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న బిర్మొలిఖల్ ఒక గ్రామం అని కూడా చెప్పడానికి వీల్లేని కొన్ని ఇండ్ల సమూహం. గత నెల 9న ఉత్తరాఖండ్ రాష్ట్ర 21వ అవతరణ దినోత్సవంలో పాల్గొన్న రావత్ తన సొంతూరు జ్ఞాపకాలను పంచుకున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత పుట్టిన ఊరిలోనే ఇల్లు నిర్మించుకుంటానని తెలిపారు. జీవనోపాధి కోసం అక్కడి ప్రజలు ముఖ్యంగా యువత వలసలు పోతున్న స్థితిని చూసిన రావత్.. వారి ఉపాధి కోసం అక్కడ ఓ వాల్నట్ మొక్కల పెంపకం నర్సరీని ప్రారంభిస్తానని ప్రకటించారు.
రావత్ తన జీవనయానంలోని ప్రతి అడుగునూ గుండెలోతుల్లో పదిలపర్చుకున్న సున్నిత హృదయుడు. రావత్ 1972లో డెహ్రాడూన్లోని కాంబ్రియన్ హాల్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తన చిన్ననాటి ఆ పాఠశాలను 2017లో సందర్శించారు. ఆ సమయంలో స్కూల్ డ్రెస్ను ధరించారు. ‘స్కూల్ డ్రెస్లో హాజరైన రావత్ జ్ఞాపకాలు మేం ఎప్పటికీ దాచుకుంటాం’ అని స్కూల్ ప్రిన్సిపల్ ఎస్సీ బేలియా బాధను వ్యక్తం చేశారు.
రావత్ సతీమణి మధూలిక మధ్యప్రదేశ్లో ద్వారిఖల్ బ్లాక్లోని సైనా గ్రామానికి చెందినవారు. ఆ గ్రామాన్ని రావత్ 2018లో సందర్శించారు. తన భార్య పుట్టిైల్లెన పాతకాలం నాటి గృహాన్ని స్థానికుల పిల్లల కోసం పాఠశాలగా మార్చుతానని ప్రకటించారు. రావత్ మామ భరత్సింగ్ రావత్ మాట్లాడుతూ.. ‘రావత్ తరచు ఫోన్లో మాట్లాడేవారు. ఇంటి గురించి, స్కూల్ నిర్మాణానికి కావలసిన అవసరాల కోసం ఆరా తీసేవారు. ఈ మేరకు వచ్చే సంవత్సరం ఏప్రిల్లో ఊరికి వస్తానని కూడా చెప్పారు. కానీ ఆ మాట నిలుపుకొనే అవకాశం లేకుండానే దూరమయ్యాడ’ని కన్నీటి పర్యంతమయ్యారు.
సాధారణంగా పోలీస్, మిలటరీ విభాగాల్లో పనిచేసేవారు తాము పనిచేస్తున్న ప్రాంతంలోని ప్రజల మన్ననలు పొందటం అరుదు. ముఖ్యంగా ఉద్రిక్త ప్రాంతంగా పేరుగాంచిన కశ్మీర్లో ప్రజల ప్రేమను చూరగొనటం ఆచరణాత్మకంగా చాలా కష్టం. కానీ రావత్ ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా ప్రాంతంలో విధులు నిర్వర్తించే క్రమంలో ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. లెఫ్ట్నెంట్ జనరల్ డీపీ పాండే ఈ జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ.. ‘నేనింతవరకూ అంతటి ప్రేమాస్పదుడైన వ్యక్తిని చూడలేదు. ఆయన ఏ సమయంలోనైనా ఎవరి ఫోన్ కాల్నైనా ఎత్తి మాట్లాడేవారు. సాధారణ ప్రజలు కూడా రావత్కు ఏ సమయంలోనైనా ఫోన్ చేసేవారు. వారు చెప్పేదంతా సావధానంగా విని, వారి సమస్యలు పరిష్కరించండని మమ్మల్ని పురమాయించేవారు. రావత్ అకాల మరణంతో అందరికన్నా బారాముల్లా ప్రజలే ఎక్కువ కోల్పోయారు’ అని తెలిపారు.
‘బారాముల్లా ప్రాంతంలో రావత్ సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించారు. ఆయన మరణం భారత సైన్యానికే కాదు, మొత్తం దేశానికే తీరని లోటు. ఆయన మరణం దేశానికే పెద్ద విషాదం. ఆ విషాదం నుంచి బయటికి రావటానికి నాకు చాలా సమయం పడుతుంది. ఆయనతో నాకున్న అనుబంధం అలాంటిది..’ అని పాండే కన్నీరు కార్చారు.